తప్పుడు మైలేజ్ టెస్టింగ్లు: సుజుకీ సీఈఓ రాజీనామా!
టోక్యో: తప్పుడు మైలేజ్ టెస్టింగ్ పద్ధతులు బయటపడిన కారణంగా సుజుకీ మోటార్ కోర్పోరేషన్ సీఈఓ, ఛైర్మన్ ఒసాము సుజుకీ తన సీఈఓ పదవికి రాజీనామా చేయనున్నారు. ఈ విషయాన్ని జపనీస్ ఆటోమొబైల్ సంస్ధ సుజుకీ మోటార్స్ బుధవారం ఈ విషయాన్ని వెల్లడించింది.
అయితే సుజుకీ ఛైర్మన్ పదవిలో మాత్రం ఒసాము కొనసాగుతారని కంపెనీ పేర్కొంది. ఇక ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఒసాము హోండా రిటైర్ అవుతున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. కంపెనీ వార్షిక సర్వ సభ్య సమావేశంలో షేర్ హోల్డర్స్ నుంచి అనుమతి లభించగానే జూన్ 29 నుంచి సుజుకీ చైర్మన్ పాత్రలో మార్పు, వైస్ ప్రెసిడెంట్ రిటైర్మెంట్ అమల్లోకి వస్తాయని కంపెనీ వెల్లడించింది.
జపాన్లో నాల్గవ స్థానంలో ఉన్న సుజుకీ మోటార్ కోర్పోరేషన్ కార్లకు ఇంధన సామర్ధ్యం, ఉద్గార పరీక్షలను నిర్దిష్ట ప్రమాణాలకు తగ్గట్లుగా నిర్వహించలేదని మే నెలల్లో సుజుకీ అంగీకరించింది. దీనిపై జపాన్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ విచారణలో ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలను పాటించనందుకు సంజాయిషీ ఇచ్చింది.
జపాన్ విచారణాధికారుల దర్యాప్తులో ఈ తప్పుడు మైలేజ్ టెస్టింగ్లను ఉద్దేశపూర్వకంగా చేయలేదని స్పష్టం చేసింది. 2010 నుంచి ఉన్న పరీక్షా పద్ధతులనే పాటిస్తూ వచ్చామని పేర్కొంది. అయితే సుజుకీ చేసిన తప్పుడు మైలేజీ టెస్టింగ్ వల్ల 16 మోడళ్లు, 20 లక్షల కార్లపైనే ఈ ప్రభావం ఉంటుందని సుజుకీ సంస్ధ పేర్కొంది.