సిడ్నీ సీజ్: గన్మన్తో కేఫ్ మేనేజర్ పోరు, మృతి
సిడ్నీ: లిండ్ కేఫ్ ఆపరేషన్లో మరణించిన ఇద్దరు వ్యక్తుల్లో 34 ఏళ్ల కేఫ్ మేనేజర్ టోరీ జాన్సన్ ఒకరు. గన్మన్ నుంచి ఆయన ఆయుధం లాక్కోవడానికి పోరాటం చేస్తూ కొంత మంది తప్పించుకోవడానికి అవకాశం కల్పించారు. సాయుధుడు జరిపిన కాల్పుల్లో గాయపడిన జాన్సన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన ప్రముఖ ఆస్ట్రేలియా కళాకారుడు కెన్ జాన్సన్, ఆయన మాజీ భార్య రోవేనా పుత్రుడు.
జాన్సన్ వీరోచిత చర్యను డిప్యూటీ పోలీసు కమిషనర్ కాథరిన్ బర్న్ ధ్రువీకరించలేదు. కేఫ్లో ఏం జరిగిందనేది తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. నెలల తరబడి దర్యాప్తు జరిగే అవకాశం ఉన్నట్లు మీడియా వ్యాఖ్యానిస్తోంది. జాన్సన్ 2012 అక్టోబర్ నుంచి లిండ్ కేఫ్లో పనిచేస్తున్నారు. సిడ్నీ, అమెరికా రెస్టారెంట్లలో కూడా ఆయన పనిచేశారు.
ఆయన కుటుంబ సభ్యులు రెడ్ఫెర్న్ అపార్టుమెంటు వద్దకు చేరుకున్నారు. ఈ భూమి నుంచి తమ అందమైన పుత్రుడు శాశ్వతంగా వెళ్లిపోయాడని ఆయన తల్లిదండ్రులు ఓ ప్రకటన జారీ చేశారు. ఆయన తమ జ్ఞాపకాల్లో ఉండిపోతాడని అన్నారు. కత్రినా డాసన్ కుటుంబానికి సంతాపం తెలుపుతున్నట్లు చెప్పారు.
మరణించిన బందీల్లో 38 ఏళ్ల కత్రినా డాసన్ ఉన్నారు. ఆమెకు ముగ్గురు పిల్లలున్నారు. ఆమె అటార్నీగా పనిచేస్తున్నారు. గర్భవతి టైలర్రు రక్షించే ప్రయత్నంలో డాసన్ ప్రాణాలు కోల్పోయినట్లు చెబుతున్నారు. సంఘటనా స్థలం నుంచి ఆమె స్ట్రెచర్పై తీసుకుని వెళ్లారు.