ఆ 3 జిల్లాలు మళ్లీ తాలిబన్ల ఆధీనంలోకి-గడువు దాటితే,అమెరికాకు గట్టి వార్నింగ్-పంజ్షీర్లో భీకర యుద్ధం తప్పదా?
ఆఫ్గనిస్తాన్లో పరిస్థితులు అల్లకల్లోలంగా మారాయి. ఓవైపు తాలిబన్ల అరాచకాలు... మరోవైపు సాయుధ తిరుగుబాటు... ఈ పరిణామాలు చివరకు ఎక్కడికి దారితీస్తాయోనన్న ఆందోళన నెలకొంది. తాలిబన్ల రాజ్యాన్ని కూలదోసేందుకు ఎక్కడికక్కడ ప్రజా సాయుధ బృందాలు రంగంలోకి దిగేందుకు ప్రయత్నిస్తున్నాయి.ఈ క్రమంలో యాంటీ తాలిబన్ కమాండర్ ఖైర్ మహమ్మద్ అందరబీ నేతృత్వంలో జరిపిన తిరుగుబాటులో మూడు జిల్లాలను తాలిబన్ల నుంచి విముక్తి చేయగలిగారు. అయితే 24 గంటలు గడవక ముందే తాలిబన్లు తిరిగి ఆ 3 జిల్లాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు.
Recommended Video

తాలిబన్ల లేటెస్ట్ ప్రకటన...
తాలిబన్ ప్రతినిధి ఒకరు సోమవారం(ఆగస్టు 23) మాట్లాడుతూ... బగ్లాన్ ప్రావిన్స్లోని బనో,దెహ్ సలెహ్,పుల్ ఇ హెసార్ జిల్లాలను తిరిగి తమ ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు ప్రకటించారు. అయితే ఈ క్రమంలో తాలిబన్ గ్రూప్లో భారీ ఎత్తున ప్రాణనష్టం వాటిల్లిందని చెబుతున్నారు. ఇక ఇప్పటివరకూ తమ ఆధీనంలోకి రాని ఒకే ఒక్క ప్రావిన్స్ పంజ్షీర్ను కూడా ఆక్రమిస్తే... ప్రజా తిరుగుబాటును పూర్తిగా అణచివేయొచ్చునని తాలిబన్లు భావిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఆ ప్రావిన్స్ వైపు పదుల సంఖ్యలో వాహనాల్లో వందలాది తాలిబన్లు బయలుదేరారు. ఈ క్రమంలో పంజ్షీర్కు సమీపంలోని అందరబ్ వరకు వారు చేరుకున్నట్లు తెలుస్తోంది.

భీకర యుద్ధం తప్పదా...
తాలిబన్ బలగాలు పంజ్షీర్ వైపు దూసుకెళ్తుండటంతో మరో భీకర యుద్ధం తప్పదేమోననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాలిబన్లను ఎదుర్కొనేందుకు పంజ్షీర్ నాయకుడు మసౌద్ ఇప్పటికే 9వేల మందికి శిక్షణ ఇప్పిస్తున్నాడు. తాలిబన్లు ఏ క్షణం అక్కడ కాలు మోపినా... వారిని అక్కడి నుంచి తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని పంజ్షీర్ వాసులు చెబుతున్నారు. అయితే తాలిబన్ల వద్ద ఉన్న సాయుధ సంపత్తి ముందు పంజ్షీర్ పోరాటం నిలబడగలదా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సుదీర్ఘ పోరాటం జరిగితే పంజ్షీర్ తాలిబన్లను నిలువరించడం కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కొనసాగుతున్న తరలింపు ప్రక్రియ...
కాబూల్ విమానాశ్రయం నుంచి ప్రస్తుతం ఆయా దేశస్తుల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకూ 18వేల పైచిలుకు మందిని స్వదేశానికి తరలించినట్లు అమెరికా ప్రకటించింది. భారత్ ఇప్పటివరకూ 500 పైచిలుకు మందిని స్వదేశానికి తరలించింది. ఇప్పటికీ తరలింపు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఆగస్టు 31 లోగా తరలింపు ప్రక్రియను పూర్తి చేయాలని అమెరికా భావిస్తోంది. విమానాశ్రయంపై ఐసిస్ దాడులు జరగొచ్చుననే హెచ్చరికలతో తరలింపు ప్రక్రియను వేగవంతం చేస్తోంది. ఇందుకోసం 18 విమాన సర్వీసులను నడపాలని నిర్ణయించింది. కాబూల్ నుంచి ఢిల్లీకి ప్రతీ రోజు రెండు విమానాలు నడిపేలా భారత్కు అమెరికా,నాటో దళాలు అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే.

గడువు దాటితే తీవ్ర పరిణామాలే... తాలిబన్ హెచ్చరిక..
ఒకవేళ తరలింపు ప్రక్రియను పూర్తి చేయడంలో డెడ్లైన్ గడువు దాటితే తీవ్ర పరిణామాలు ఉంటాయని తాలిబన్లు హెచ్చరించారు. అందుకు తాము అనుమతించమని స్పష్టం చేశారు. అయినప్పటికీ దూకుడుగా ముందుకెళ్తే అది తమను రెచ్చగొట్టడమే అవుతుందని... అందుకు తగిన రియాక్షన్ ఉంటుందని పేర్కొన్నారు.ఆగస్టు 31 లోపు అమెరికన్ మిలటరీ సహా అమెరికన్ల తరలింపు ప్రక్రియ పూర్తి చేయాల్సిందేనన్నారు. బ్రిటన్ కూడా డెడ్ లైన్ లోపు తమవారిని తరలించాలన్నారు. తాలిబన్ ప్రతినిధి డా.సుహైల్ షహీన్ ఈ విషయాలు వెల్లడించారు.

తాలిబన్ల హెచ్చరికలపై అమెరికా రియాక్షన్...
తాలిబన్ల హెచ్చరికలపై అమెరికా రక్షణ శాఖ ప్రెస్ సెక్రటరీ జాన్ కిర్బీ స్పందించారు. తాలిబన్ల దృక్పథమేంటో తమకు అర్థమవుతోందన్నారు.వీలైనంత త్వరగా తమవారిని ఆఫ్గనిస్తాన్ నుంచి తరలించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఆగస్టు 31 లోపు సాధ్యమైనంత మేర అమెరికన్లను అక్కడినుంచి తరలిస్తామన్నారు. ఒకవేళ మరింత సమయం అవసరమైతే... తాలిబన్ ప్రతినిధులతో చర్చలు జరుపుతామన్నారు.

గడువు పెంచాలంటున్న బోరిస్ జాన్సన్
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు కీలక విజ్ఞప్తి చేశారు. తమ సైన్యాన్ని,అమెరికన్లను తరలించేందుకు ఆగస్టు 31 డెడ్లైన్గా విధించినట్లు బైడెన్ ప్రకటించడంపై బోరిస్ జాన్సన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అమెరికా సైన్యాన్ని మరికొద్ది రోజులు అక్కడ ఉంచగలిగితే అక్కడ చిక్కుకుపోయిన మరింతమందిని తరలించేందుకు వీలవుతుందన్నారు. ఆఫ్గనిస్తాన్లో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు జీ7 దేశాల వర్చువల్ సమావేశానికి బ్రిటన్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. మంగళవారం(ఆస్టు 24) జరగనున్న ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు. మానవతా దృక్పథంతో ఆఫ్గన్ ప్రజలకు ఆర్థిక సాయం చేయడంతో పాటు శరణార్థులను తరలించేందుకు సహకరించాలని జీ7 దేశాలను బోరిస్ జాన్సన్ కోరనున్నారు.

కొనసాగుతున్న తాలిబన్ల అరాచకాలు
తాలిబన్ల పాలనలో ఎవరిపై కక్ష సాధింపు చర్యలు ఉండవని... మిలటరీతోనూ తమకెలాంటి శత్రుత్వం లేదని ఇటీవల తాలిబన్లు ప్రకటించారు. కానీ సైనికులను పట్టుకునేందుకు ఇంటింటికీ తాలిబన్లు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. మరోవైపు ఆడపిల్లల కుటుంబాలను వేధింపులకు,హింసకు గురిచేస్తున్నారు. వారి కూతుళ్లను తమతో పంపించాలని... తమకిచ్చి పెళ్లిళ్లు చేయాలని తాలిబన్లు ఆ కుటుంబాలను వేధిస్తున్నారు. కొన్నిచోట్ల యువతులను చెక్క పెట్టెల్లో నిర్బంధించి సెక్స్ బానిసలుగా ఇతర దేశాలకు తరలిస్తున్నారు.
మహిళా జర్నలిస్టులను ఇప్పటికే ఆయా మీడియా సంస్థలు ఇంటికి పంపించేశాయి. తాలిబన్ల పాలనలో మహిళల రాజకీయానికి తావు లేదని ఇటీవల వెలుగుచూసిన ఓ వీడియోలో తాలిబన్ల మాటలను బట్టి అర్థమైంది. స్వేచ్చ,హక్కులు మృగ్యమైన చోట ప్రస్తుతం తాలిబన్లు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఏ క్షణాన ఏ తాలిబన్ తుపాకీ తమను ఎక్కుపెడుతుందో తెలియని ఆందోళనలో బతుకుతున్నారు. దేశం విడిచి పారిపోయేందుకు వేలాది మంది కాబూల్ విమానాశ్రయానికి తరలివస్తున్నా... ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతమందిని అక్కడి నుంచి తరలించడం అసాధ్యంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications