ఒమర్ మృతిపై తాలిబన్: కొత్త ఛీఫ్గా ముల్లా మన్సోర్
తాలిబన్ సుప్రీం కమాండర్గా కొత్త లీడర్ని ఎంపిక చేశారు. సుదీర్ఘకాలం పాటు తాలిబన్ లీడర్గా ఉన్న ముల్లా మహ్మద్ ఒమర్ చనిపోయినట్టు ఇటీవల ప్రకటించడంతో నూతన నాయకుడిగా ముల్లా అక్తర్ మన్సోర్ను ఎన్నుకున్నట్టు తాలిబన్ తమ వెబ్సైట్లో తెలిపింది.
తాలిబన్ అధికార ప్రతినిధి జాబిహుల్లా ముజహింద్ ఈ వార్తను శుక్రవారం ధ్రువీకరించారు. సుదీర్ఘకాలం నుంచి ఒమర్కు నమ్మకస్తుడుగా, సన్నిహితుడుగా ఉంటున్నందువల్లే మన్సోర్ను నియమించినట్టు జాబిహుల్లా పేర్కొన్నారు. కాగా ముల్లా మహ్మద్ ఒమర్ తీవ్ర అనారోగ్యంతో చనిపోయాడని చెబుతున్న తాలిబన్ గ్రూప్, ఎప్పుడు, ఎక్కడ మరణించాడనేది మాత్రం వెల్లడించలేదు.
అయితే తాలిబన్ లీడర్ ముల్లా మహ్మద్ ఒమర్ చనిపోయినట్టు ఆప్ఘనిస్ధాన్ ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించింది. ఒమర్ 2013లో పాకిస్థాన్లో మృతిచెందినట్లు, ఈ మేరకు తమకు లభించిన సమాచారాన్ని ధ్రువీకరిస్తున్నట్లు దేశాధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ అధికార ప్రతినిధి సయ్యద్ జాఫర్ హషేమీ ప్రకటించారు.
ఇక తాలిబన్లతో శాంతి చర్చలు ఇంతకముందుకన్నా సజావుగా జరుగుతాయని ప్రభుత్వం భావిస్తున్నదని, ఈ అవకాశాన్ని వినియోగించుకొని వారు చర్చల్లో పాల్గొనాలని ఆయన కోరారు. అయితే ఒమర్ మృతికి సంబంధించి తాలిబన్లు మాత్రం ఎటువంటి ప్రకటనా చేయలేదు.
ఆప్ఘనిస్థాన్పై పౌరయుద్ధంలో గెలుపొందడం ద్వారా 1996లో ఒమర్ సారథ్యంలో తాలిబన్లు పాలన చేపట్టారు. అయితే 2001 వరకు కొనసాగిన తాలిబన్ల నిరంకుశ పాలన ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. ఈ క్రమంలో ఒసామా బిన్ లాడెన్ నేతృత్వంలోని అల్కాయిదాకు ఒమర్ మద్దతుగా నిలిచాడు.
అయితే ఆల్ఖైదా చేసిన 9/11 దాడులతో అటు లాడెన్తోపాటు ఒమర్ కూడా అమెరికాకు లక్ష్యంగా మారాడు. దీంతో అమెరికా సేనలు చేసిన దాడుల్లో 2001లో ఒమర్ అధికారాన్ని కోల్పోయాడు.