తాలిబన్ ఆఫ్ఘాన్: ఒకప్పటి ఖైదీ తాలిబన్లే.. ఇప్పుడు కాబూల్ జైలు అధికారులయ్యారు!
కాబూల్: ఆప్ఘనిస్థాన్ తాలిబన్ల పరిపాలన మొదలైనప్పటి నుంచీ అరాచకాలే కొనసాగుతున్నాయి. తమకు వ్యతిరేకంగా వ్యవహరించేవారిని అత్యంత దారుణంగా హత్యలు చేస్తున్నారు. తాజాగా, మరో వింత పరిణామం వెలుగులోకి వచ్చింది. కాబూల్ శివారులోని ఫుల్ ఇ ఛర్కీ అనే జైల్లో ఆఫ్ఘాన్ ప్రభుత్వం తాలిబన్ ఖైదీలను ఉంచేది. ఇప్పుడు తాలిబన్లే పరిపాలనాధికారులు కావడంతో ఆ జైలు అధికారులుగా మారిపోయారు ఒకప్పటి ఖైదీ తాలిబన్లు.
ఆగస్టులో కాబూల్ ను తాలిబన్లు హస్తగతం చేసుకున్న తర్వాత.. ఈ జైలు కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అందులోని ఖైదీలందరినీ వదిలిపెట్టారు. ప్రస్తుతం అక్కడ దాదాపు 60 మంది కరుడుగట్టిన నేరస్తులు మినహా దాదాపు జైలంతా ఖాళీగానే ఉంది. తాజాగా, ఈ జైలుకు ఇంఛార్జ్గా ఉన్న తాలిబన్ కమాండర్ ఒకరు సోమవారం జైలును సందర్శించారు.

దశాబ్దం క్రితం తనను ఆప్ఘాన్ ప్రభుత్వం అరెస్ట్ చేసి ఇదే జైలుకు తీసుకొచ్చిందని, అక్కడ తనను చిత్రహింసలకు గురిచేసిందని అతడు తెలిపాడు. దాదాపు 14 నెలల తర్వాత తాను జైలు నుంచి విడుదలైనట్లు చెప్పాడు. పుల్ ఇ ఛర్కీ జైలు అనేది.. ఆప్ఘాన్లోనే ప్రధాన జైలు. ఇక్కడ ఒకప్పుడు ఖైదీల సామూహిక హత్యాకాండ జరిగేదని ప్రచారం.
ఆప్ఘాన్లో పౌర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది తాలిబన్లను అరెస్ట్ చేసి ఈ జైలులోనే బందీలుగా ఉంచారు. ఐదువేల ఖైదీల సామర్థ్యమున్న ఈ జైలులో 10వేలకు పైనే ఖైదీలు ఉండేవారు. ఇటీవల తిరిగి తాలిబన్లు అధికారంలోకి రావడంతో.. వారందరినీ విడిచిపెట్టారు. వీరిలో కొందరు ఉగ్రవాద సంస్థలకు చెందిన వారు కూడా ఉన్నట్లు సమాచారం. కాగా, ప్రస్తుతం ఈ జైలులో తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న పౌరులను అరెస్ట్ చేసి ఉంచుతున్నారు.
ఇది ఇలావుండగా, తాలిబన్ల ప్రభుత్వ ఉపప్రధాని, తాలిబన్ సహ వ్యవస్థాకుడు ముల్లా అబ్దుల్ గనీ బరాదర్ మృతి చెందినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రెసిడెంట్ ప్యాలెస్లో ప్రత్యర్థి వర్గాలతో జరిగిన ఘర్షణలో బరాదర్ గాయపడి, ఆ తర్వాత మృతి చెందినట్లు స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తన మరణ వార్తలను బరాదర్ ఖండించారు. తనకేమీ కాలేదని, క్షేమంగానే ఉన్నట్లు తాజాగా ఓ ఆడియో సందేశం ద్వారా వెల్లడించాడు. తాలిబన్ల అధికార ప్రతినిధి సుహైల్ షహీమ్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాడు.
ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్థాన్ ఉపప్రధాని ముల్లా బరాదర్ తన మరణవార్తపై వస్తున్న ఆరోపణలను కొట్టిపారేశారు. ఆ ఆరోపణలన్నీ అబద్ధాలని, వాటిల్లో నిజం లేదని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు ప్రస్తుతం ఖతార్లో ఉన్న సుహైల్ షహీమ్. ఇదే విషయాన్ని ఆప్ఘాన్ మీడియా ప్రసారం చేసింది. తాలిబన్ ప్రభుత్వ ఉపప్రధాని ముల్లా బరాదర్ తాను క్షేమంగా ఉన్నట్లు ఓ ఆడియో క్లిప్ ద్వారా వెల్లడించారని తెలిపింది. ఆప్ఘాన్లో ఇటీవల తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
ముల్లా మొహమ్మద్ హసన్ అఖుంద్ ప్రధానమంత్రిగా నియామకం కాగా, ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్కు ఉపప్రధాని పదవిని కట్టబెట్టారు. అయితే, బరాదర్ గత కొంత కాలకంగా అధికారిక సమావేశాలు, కార్యకలాపాల్లో కనిపించకపోవడంతో ఆయన మరణించినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే బరాదర్ స్పష్టతనిచ్చారు.












Click it and Unblock the Notifications