Taliban దాష్టీకం: మసీదు వద్దే అఫ్గాన్ జాతీయ మీడియా చీఫ్ దవా ఖాన్ హతం -సైన్యం దాడులు
దక్షిణాసియా దేశం అఫ్గానిస్థాన్ లో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయి. అమెరికా సేనల నిష్క్రమణ తర్వాత దేశంపై పట్టు సాధించే దిశగా తాలిబన్లు పేట్రేగిపోతున్నారు. వాళ్లను నిలువరించడానికి అఫ్గాన్ సైన్యాలు చేస్తోన్న ప్రయత్నాలు ఏమాత్రం ఫలితానివ్వడంలేదు. అఫ్గాన్ లో తిరిగి తమ రాజ్యాం నెలకొల్పే దిశగా తాలిబన్లు.. ప్రభుత్వంలోని కీలక అధికారులను టార్గెట్ చేశారు. అందులో భాగంగా..
అఫ్గానిస్థాన్లో తాలిబన్లు మరో దాష్టీకానికి పాల్పడ్డారు. అఫ్గాన్ ప్రభుత్వ మీడియా, సమాచార శాఖకు చెందిన ఉన్నతాధికారి దవాఖాన్ మీనాపాల్ను హతమార్చారు. దేశ రాజధాని నగరం కాబూల్లో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రార్థానా మందిరంలో అతడిని కాల్చి చంపారు. తమపై జరుగుతున్న రాకెట్ దాడులకు ప్రతీకారంగా దాడులు చేస్తామన్న తాలిబన్ల హెచ్చరికల అనంతరం ఈ దారుణం జరగడం గమనార్హం.

దవాఖాన్ మృతిని అఫ్గాన్ ప్రభుత్వం సైతం ధ్రువీకరించింది. అఫ్గాన్కు చెందిన ప్రముఖ అధికారిని దారుణంగా తాలిబన్లు హతమార్చారని ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. తాలిబన్లు సైతం ఇది తమ పనేనని ప్రకటించారు. అమెరికా భద్రతా బలగాలు వెనక్కి వెళ్లిన నాటి నుంచి తాలిబన్లు దారుణాలు పెచ్చుమీరాయి. అఫ్గాన్లోని కీలక ప్రాంతాలు ఇప్పటికే వారి వశమయ్యాయి. మరోవైపు తాలిబన్లు మంగళవారం జరిపిన బాంబు దాడి నుంచి రక్షణ మంత్రి త్రుటిలో తప్పించుకోగా.. ఇదే తరహాలో అఫ్గాన్ ప్రభుత్వ నేతలే లక్ష్యంగా మరిన్ని దాడులు ఉంటాయని తాలిబన్లు ఇది వరకే ప్రకటించారు. మరోవైపు,
అఫ్గాన్ లో సైన్యానికి, తాలిబన్ సేనలకు మధ్య భీకర పోరాటం జరుగుతోంది. గురు, శుక్రవారాల్లో భద్రతా బలగాల దాడుల్లో 94 మంది తాలిబన్, అల్ ఖైదా ఉగ్రవాదులు హతమయ్యారు. లష్కర్ గహ్ నగరంలో భద్రతాబలగాలు జరిపిన దాడుల్లో 94 మంది హతమయ్యారని అఫ్గాన్ రక్షణ మంత్రిత్వశాఖ శుక్రవారం వెల్లడించింది. తాలిబన్లకు, అఫ్గాన్ భద్రతా బలగాల మధ్య హెల్మాండ్ ప్రావిన్సులో గత వారం భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో తాలిబన్ రెడ్ యూనిట్ కమాండర్ మావ్లాయి ముబారక్ మరణించాడు. 94 మంది ఉగ్రవాదులు మరణించగా, మరో 16 మంది గాయపడ్డారు. అఫ్గాన్ ఉగ్రదాడుల్లో ఈ ఏడాది 1659 మంది పౌరులు మరణించగా, మరో 3,254 మంది గాయపడ్డారు.












Click it and Unblock the Notifications