ట్రంప్ అలా చేస్తే.. ఇండియన్స్కు పెద్ద దెబ్బే: వ్యతిరేకిస్తున్న టెక్ కంపెనీలు..
సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ టూల్స్ రూపొందించే గిట్ హబ్.. ఈ సమావేశం కోసం టెక్ దిగ్గజాలు ఆల్ఫాబెట్ ఇంక్ గూగుల్, ఎయిర్ బీఎన్బీ ఇంక్ వంటి కంపెనీలకు ఆహ్వానం పంపించినట్టు తెలుస్తోంది.
న్యూయార్క్: అంతా అనుకున్నట్టే.. అధికారంలోకి రాగానే అధ్యక్షుడు ట్రంప్ ముస్లిం దేశాల మీద ఉక్కుపాదం మోపారు. ఏకంగా ఏడు దేశాల నుంచి అమెరికాకు వలసలను నిషేధిస్తూ ఆయన తీసుకున్న నిర్ణయం మిగతా ప్రపంచ దేశాలను కూడా కలవరపరుస్తోంది.
ట్రంప్ నిర్ణయంపై ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ వంటి వారు ఇప్పటికే పెదవి విరవగా.. తాజాగా టెక్ దిగ్గజాలు సైతం ఈ నిర్ణయాన్ని సవాల్ చేయడానికి సిద్దమవుతున్నాయి. ట్రంప్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. అమికస్ బ్రీఫ్స్ ను ఫైల్ చేయడానికి గ్రూప్ ఆఫ్ టెక్నాలజీ కంపెనీలు మంగళవారం నాడు సమావేశం కాబోతున్నాయి.
ట్రంప్కు వ్యతిరేకంగా టెక్ దిగ్గజాలు
ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలు చేయబోతున్న పిటిషన్ డాక్యుమెంట్స్ పై కంపెనీలు చర్చించనున్నాయి. సమావేశాన్ని నిర్వహించబోయే కంపెనీ అధికార ప్రతినిధి ఈ విషయాన్ని చెప్పారు.
సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ టూల్స్ రూపొందించే గిట్ హబ్.. ఈ సమావేశం కోసం టెక్ దిగ్గజాలు ఆల్ఫాబెట్ ఇంక్ గూగుల్, ఎయిర్ బీఎన్బీ ఇంక్ వంటి కంపెనీలకు ఆహ్వానం పంపించినట్టు తెలుస్తోంది.
గూగుల్, నెట్ ఫ్లిక్స్ ఇంకా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ట్రంప్ జారీ చేసిన ట్రావెల్ బ్యాన్ పై మొత్తం టెక్నాలజీ సెక్టార్ ఆగ్రహంగా ఉంది. ఇదిలా ఉంటే ఏడు దేశాలపై నిషేధం విధించడంతో, ఇతర దేశాల్లో ఉన్న తమ ఇమ్మిగ్రేట్లను వెనక్కి రప్పించడానికి కంపెనీలు ఫైనాన్సియల్ మద్దతును అందజేస్తున్నాయి.
భారతీయుల్లో కలవరం:
ఏడు ముస్లిం దేశాలపై నిషేధం విధించడంతో.. భారతీయుల్లోను కలవరం మొదలైంది. హెచ్1బీ వీసాలను కూడా ట్రంప్ కఠినతరం చేస్తే.. భారతీయ ఉద్యోగులు సందిగ్ధంలో పడటం ఖాయం. మొత్తం మీద ట్రంప్ అధికారంలోకి వచ్చాక.. ఉద్యోగ భద్రత విషయంలో భారతీయులు ప్రతికూలతలు ఎదుర్కోక తప్పట్లేదు.
మన ఉద్యోగులకు బిగ్ లాస్:
అమెరికాలో భారతీయ ఉద్యోగులు ఎక్కువగా ఉన్నందునా.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్1బీ వీసాను గనుక కఠినతరం చేస్తే.. ఎక్కువ నష్టపోయేది భారతీయ ఉద్యోగులే. ఉద్యోగం, జీత భత్యాలు, సంక్షేమం వీటన్నింటి విషయంలో వారు ప్రతికూలతలు ఎదుర్కోక తప్పదు.
చట్టపరంగా వీసాలు పొందిన వారిని సైతం ట్రంప్ పాలనా ఆందోళనకు గురిచేస్తోంది. కాగా, వైట్హౌస్ పరిశీలనలో ఉన్న ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వు ముసాయిదా వివరాలను ఓ న్యూస్ చానల్ బయట పెట్టింది. ఇది అమలులోకి వస్తే ఆమెరికాకు చట్టపరమైన వలసలూ గణనీయంగా తగ్గిపోతాయి.
శిక్షణా వీసాల పొడగింపు ఉండదు:
ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వు ముసాయిదాలో.. శిక్షణా వీసాలను సైతం పొడగింపుకు అవకాశం లేకుండా నిర్ణయాలు ఉన్నట్టు తెలుస్తోంది. హెచ్1బీ వీసాలు పొందిన భర్త లేదా భార్యకు వర్క్ పర్మిట్ తొలగించడం వంటి ప్రతిపాదనలు కూడా ఈ ముసాయిదాలో ఉన్నాయి.
ఎల్1 వీసాలు కలిగిన గెస్ట్ వర్కర్స్ కు ఉపాధి కల్పిస్తున్న కంపెనీలను హోం ల్యాండ్ సెక్యూరిటీ అధికారులు తనిఖీ చేయాలన్న నిబంధనను కూడా ముసాయిదాలో చేర్చినట్టు సమాచారం. ట్రంప్ గనుక ఈ ఆర్డర్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. భారతీయులకు మాత్రం పెద్ద దెబ్బే.