భారత బలగాలపై దాడి చేయండి: జిహాదీలకు పిలుపు
న్యూఢిల్లీ: ప్రపంచ వేదికపై పాకిస్తాన్ను ఒంటరి చేయాలని భారత్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ భూభాగం నుంచి పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ తెహ్రీక్ - ఎ-తాలిబన్ పాకిస్తాన్ (టిటిపి) తన జిహాదీలకు భారత భద్రతా బలగాలపై దాడి చేయాలని తాజాగా పిలుపునిచ్చింది.
మీడియా వార్తల కథనం ప్రకారం - పాకిస్తాన్ తాలిబన్ కాశ్మీర్లో జిహాద్ను విస్తరించాలనే ప్రయత్నంలో ఉంది. భారత బలగాలపై దాడులను పెంచాలనే ఎత్తుగడలో అది ఉన్నట్లు తెలుస్తోంది. యురి దాడుల్లో భారత్ తన సైనికుల ప్రాణాలను కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ సంఘటన తర్వాత టిటిపి ఈ తాజా పిలుపు ఇచ్చింది.
యురి ఘటనతో పాకిస్తాన్, భారత్ మధ్య సంబంధాలు మరింతగా బలహీనపడ్డాయి. కాశ్మీర్ ఘర్షణలో తాము జోక్యం చేసుకోదలుచుకోలేదని టిటిపి గత నెలలో బహిరంగ ప్రకటన చేసింది. ముజాహిదీన్లకు పెద్ద శత్రువైన పాకిస్తాన్ బలగాలతో తమ పోరాటం ఉంటుందని అప్పుడు ప్రకటించింది.
పాకిస్తాన్ సైన్యంపై పోరాటానికి వివిధ గ్రూపులు ఐక్యమై 2007లో టిటిపిగా ఏర్పడ్డాయి. ఇప్పటి వరకు పాకిస్తాన్, అమెరికా మిలటరీని మాత్రమే లక్ష్యంగా చేసుకున్న టిటిపి తాజాగా భారత్ బలగాలపై దాడులు చేయాలని పిలుపునివ్వడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.