ఉక్రెయిన్లో బంకర్లలోనే బిక్కుబిక్కుమంటూ తెలుగు విద్యార్థులు; నేడు ఇండియాకు ప్రత్యేక విమానంలో 470మంది
ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్ రష్యా యుద్ధం కొనసాగుతున్న సమయంలో ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలుగువారు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. వారిని భారత్ కు తీసుకురావడానికి శతవిధాల ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ అక్కడ వారి పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉంది. ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఉక్రెయిన్లో తెలుగు వారున్నారు.

ప్రత్యేక విమానంలో నేడు దేశానికి 470 మంది
ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలుగు వారి బాధలు అన్నీ ఇన్ని కావు. కొందరి ఎలాగోలా బయటపడుతూ భారత్ కు చేరుకునే మార్గాలు వెతుక్కుంటే, మరి కొందరు దిక్కుతోచని స్థితిలో బంకర్ ల లోకి వెళ్లి భయాందోళన మధ్య కాలం గడుపుతున్నారు. తమని ఎలాగైనా తీసుకువెళ్లాలని భారత ఎంబసీని వేడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వారిని తరలించడానికి సన్నాహాలు మొదలుపెట్టింది. ఉక్రెయిన్ లో చాలా సిటీ ల నుండి రొమేనియా కు చేరుకున్న వారంతా ప్రత్యేక విమానంలో మన దేశానికి బయలుదేరిన పరిస్థితి ఉంది. ఇందులో మొత్తం 470 మంది ఉన్నారు.

విమానంలో నలుగురు తెలుగు విద్యార్థులు
ఈ విమానం ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకుంటుందని అధికారులు చెబుతున్నారు. అందులో తెలుగువాళ్లు కూడా ఉన్నట్లుగా సమాచారం. మొత్తం 13 మంది వైద్య విద్యార్థులు ఆ ప్రత్యేక విమానంలో ఉన్నారని, ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు నలుగురు ఉన్నారని సమాచారం.కృష్ణా జిల్లాకు చెందిన రాజులపాటి అనూష, చిత్తూరు జిల్లాకు చెందిన తోటకూరి హర్షిత, తెలంగాణకు చెందిన గంగరాజు నాగ శ్రీకరి, నీలా హర్షవర్ధన్ ఈరోజు ఈ ప్రత్యేక విమానంలో రాబోతున్నారు.
రవాణా సదుపాయాలు లేక అక్కడే ఉండిపోయిన చాలా మంది విద్యార్థులు
భారత్ కు ఏ విధంగా రావాలో ప్రయాణం సమాచారం లేని వారు, అక్కడ ఎటువంటి రవాణా సదుపాయాలు లేని వారు బిక్కుబిక్కుమంటూ భయాందోళన మధ్య కాలం గడుపుతున్నారు. వీరిని తరలించడానికి ఏర్పాటుచేసిన ప్రత్యేక ఏర్పాట్లకు దూరంగా ఉన్నవారు కూడా రాలేని పరిస్థితి ఉంది .జెఫోరిషియ సిటీలో ఇంకా కొందరు తెలుగు విద్యార్థులు అక్కడ ఉన్న పరిస్థితి ఉంది. వారంతా తమను ఎలాగైనా ఇండియా చేర్చాలని వేడుకుంటున్నారు.

బంకర్లలో తలదాచుకున్న విద్యార్థులు .. బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్ళదీత
ఉక్రెయిన్ పై రష్యా దాడులు ప్రారంభం కాగానే అక్కడ కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులను బంకర్ ల లోకి వెళ్లాలి అంటూ కొన్ని యూనివర్సిటీలో ఆదేశాలు జారీ చేశాయి. దీంతో కొందరు విద్యార్థులు తమ నివాస గృహాలకు సమీపంలో ఉన్న బంకర్ లలోకి వెళ్లారు. అక్కడ నుంచి వీడియో తీసి తమ తల్లిదండ్రులకు పంపుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం తామందరం క్షేమంగానే ఉన్నామని చెబుతున్నారు. ఇదిలా ఉంటే విద్యార్థులను క్షేమంగా ఇండియాకు తీసుకురావాలని వారి తల్లిదండ్రులు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను కోరుతున్నారు.
Recommended Video

రంగంలోకి దిగిన ప్రభుత్వాలు.. ఆహారం కూడా లేక ఇబ్బంది పడుతున్న తెలుగువారెందరో
తెలంగాణ ప్రాంతానికి చెందిన కొందరు ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేశారు. ఇటు ప్రభుత్వాలు కూడా వారు అందరూ క్షేమంగా తీసుకురావడానికి తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. ఎవరు భయపడవద్దని పేరెంట్స్ కు చెబుతున్నారు. మొత్తం 18 వేల మంది భారతీయులు ఉక్రెయిన్ లో ఉన్నారు. వారిలో అత్యధికంగా విద్యార్థులే ఉన్నారు. కనీసం నిత్యావసరాలు కూడా లేక, అరకొర ఆహారం తీసుకుంటూ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. బయటికి రావాలంటే ఎక్కడ ఏం జరుగుతుందోనన్న భయం, ప్రభుత్వం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసినా అక్కడిదాకా చేరుకోలేని ఇబ్బందులు వెరసి వారి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది.












Click it and Unblock the Notifications