కూలిన విమానం: ఉగ్రవాద కోణం, ఇంకా దొరకని ఆచూకీ
బీజింగ్: మలేసియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్కు వెళ్తూ అదృశ్యమైన మలేషియా ఎయిర్ లైన్స్కు చెందిన విమానం జాడ ఇంకా తెలియలేదు. ఈ ఘటనలో ఉగ్రవాద పాత్ర పైన మలేషియా ఆదివారం దర్యాఫ్తు ప్రారంభించింది. దొంగిలించిన పాస్ పోర్టులతో ఇద్దరు వ్యక్తులు.. గల్లంతైన విమానంలో ప్రయాణించారన్న నేపథ్యంలో ఈ ఘటనలో ఉగ్రవాద కోణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దక్షిణ చైనా సముద్రంపై అదృశ్యం అయిన మలేసియా ఎయిర్లైన్స్ విమానం జాడ తెలుసుకోవడానికి ఆదివారం రెండో రోజు కూడా పలు దేశాలకు చెందిన సహాయక బృందాలు పెద్ద ఎత్తున గాలింపు కొనసాగిస్తున్నాయి. 239 మందితో ప్రయాణిస్తున్న ఈ విమానం సముద్రంలో కూలిపోయి ఉండవచ్చని, విమానంలోని అందరు కూడా చనిపోయి ఉండవచ్చని భయపడుతున్న అధికారులు, సంఘటనకు ఉగ్రవాదంతో సంబంధం ఉండే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.

కౌలాలంపూర్ నుంచి బీజింగ్కు వెళ్తూ దక్షిణ చైనా సముద్రంపై కనిపించకుండా పోయిన బోయింగ్ 777 విమానంలో అయిదుగురు భారతీయులు సహా 227 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. శుక్రవారం కౌలాలంపూర్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన గంట తర్వాత హఠాత్తుగా రాడార్ పైనుంచి అదృశ్యమైన ఈ విమానం కోసం ఆరు దేశాలకు చెందిన విమానాలు, నౌకలు ఆదివారం రెండో రోజు కూడా గాలిస్తున్నాయి.
గాలింపులో పాలు పంచుకోవడానికి తాము మూడు జెట్ విమానాలను పంపించినట్లు మలేసియా పౌర విమానయాన శాఖ అధికారులు ఆదివారం చెప్పారు. అయితే సముద్ర జలాలపై విమానానికి చెందిన శిథిలాలు ఏవీ తేలుతూ కనిపించకపోవడంతో ఈ గాలింపు ఏమాత్రం పురోగతి సాధించలేదు. కనిపించకుండా పోయిన విమానం ఏమయిందో గాలింపు బృందాలు ఇప్పటికీ కనుగొనలేక పోయాయని మలేసియా ఎయిర్లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది.
విమానంలోని అందరూ చనిపోయి ఉండవచ్చన్న భయాలను ఎయిర్లైన్స్ వ్యక్తం చేస్తూ అమెరికాలోని అట్లాంటాకు చెందిన డిజాస్టర్ రికవరీ మేనేజిమెంట్ స్పెషలిస్టు ఈ క్లిష్ట సమయంలో ఎయిర్లైన్స్కు సహకారం అందిస్తున్నట్లు తెలిపింది. ఈ విమానానికి సంబంధించి ప్రజలకు అన్ని విషయాలను తెలియజేయడంలో మలేసియా ఎయిర్లైన్స్ పారదర్శకంగా వ్యవహరిస్తుందని మరోసారి స్పష్టం చేస్తున్నామని కూడా ఆ ప్రకటన తెలిపింది.
కనిపించకుండా పోయిన విమానం లొకేషన్ను నిర్ధారించుకున్న వెంటనే కేలంటాన్ రాష్ట్రంలోని కోటాబారులో కానీ, హోచిమిన్ సిటీలో కానీ ఒక కమాండ్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని తెలిపింది. సహాయ చర్యల్లో పాలుపంచుకోవడానికి సింగపూర్ రెండు యుద్ధ నౌకలను, ఒక నేవీ హెలికాప్టర్ను పంపగా, చైనా రెండు రెస్క్యూ నౌకలను పంపించింది. అమెరికా నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు, ఎఫ్బిఐ, బోయింగ్ సంస్థకు చెందిన అధికారులతో కూడిన ఒక నిపుణుల బృందాన్ని పంపించింది. అమెరికా నౌకాదళం సహాయక చర్యల్లో తోడ్పాటు అందించడం కోసం ఒక గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ నౌకను వియత్నాం దక్షిణ సముద్ర తీరానికి పంపించింది.
భారతీయ కుటుంబాల ఎదురుచూపు
జాడ తెలియకుండా పోయిన మలేసియా ఎయిర్లైన్స్ విమానంలో ప్రయాణిస్తున్న అయిదుగురు భారతీయుల బంధువులు విమానం ఏమయిందనే విషయం, తమ వారి యోగక్షేమాలకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ విమానంలో ప్రయాణిస్తున్న తన తల్లిదండ్రులు, సోదరుడి సమాచారం తెలుసుకోవడానికి సామ్వేద్ కోలేకర్, ఆయన భార్య 154 మంది చైనా ప్రయాణికుల బంధువులతో పాటుగా బీజింగ్లోని ఓ హోటల్లో ఎదురు చూస్తున్నారు.
ఈ విమానంలో ప్రయాణిస్తున్న అయిదుగురు భారతీయుల్లో సామ్వేద్ తండ్రి వినోద్ కోలేకర్ (59), తల్లి చేతన (55), తమ్ముడు స్వానంద్ (23) ఉన్నారు. మిగతా ఇద్దరు భారతీయుల్లో చంద్రికా శర్మ (51), క్రాంతి ప్రహ్లాద్ శిర్శథ్ ఉన్నారు. క్రాంతి భర్త ఉత్తర కొరియాలోని ప్యోంగ్యాంగ్లో ఉంటారు.












Click it and Unblock the Notifications