ఉగ్రవాద దేశం: యూఎన్ వేదికగా పాకిస్థాన్ను ఏకిపారేసిన భారత్
న్యూయార్క్: మరోసారి అంతర్జాతీయ వేదికపైగా భారత్ చేతిలో చావుదెబ్బతింది పాకిస్థాన్. ఐక్యరాజ్య సమితిలో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన పాకిస్థాన్కు భారత్ గట్టిగా గుణపాఠం చెప్పింది. ఉగ్రవాదులకు ఆతిథ్యమిస్తూ అంతర్జాతీయ ఉగ్రవాదానికి స్వర్గధామంలా ఉన్న దేశం నుంచి నిర్మాణాత్మక సహకారం ఆశించలేమని విమర్శించింది.
అస్థిరతను పెంచి పోషించడంలో ప్రపంచంలోనే పాకిస్థాన్ను మించిన శక్తి లేదని మండిపడింది. ఐక్య రాజ్యసమితిలో సాధారణ అసెంబ్లీ తొలి కమిటీ సమావేశంలో నిరాయుధీకరణ, అంతర్జాతీయ భద్రతా సమస్యలకు సంబంధించిన చర్చలో భారత శాశ్వత మిషన్లో కౌన్సిలర్ ఎ.అమర్నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జమ్మూకశ్మీర్ అంశాన్ని యూఎన్లో పాక్ రాయబారి మునీర్ అక్రమ్ లేవనెత్తగా.. అమర్నాథ్ పాకిస్థాన్ వైఖరిని అంతర్జాతీయ వేదికపై తీవ్రంగా ఎండగట్టారు.
అణ్వస్త్ర సామగ్రి, సాంకేతికతను అక్రమంగా ఎగుమతిచేసిన చరిత్ర కలిగిన పాకిస్థాన్నుంచి నుంచి సలహా తీసుకొనే అవసరం భారత్కు లేదన్నారు. అసత్యాలు, అర్ధసత్యాలతో అంతర్జాతీయ వేదికల పవిత్రతను దెబ్బతీసేందుకు పాకిస్థాన్ ప్రయత్నాలు చేస్తోందని భారత్ ఆరోపించారు.
Recommended Video
భారత్పై పాకిస్థాన్ అనేక పనికిరాని, నిరాధార ఆరోపణలు చేస్తోందని, జమ్మూకాశ్మీర్, లఢఖ్లకు సంబంధించి కూడా అవాకులు పేలుతోందని భారత్ ఆగ్రహం వ్యక్తంచేశారు. జమ్మూకాశ్మీర్ పూర్తిగా భారత్ అంతర్గత వ్యవహారమని మరోసారి స్పష్టం చేసింది. భారత్తో కాశ్మీర్ ఎప్పటికీ విడదీయరాని భాగమని తేల్చి చెప్పారు భారత ప్రతినిధి అమర్నాథ్. పాకిస్థాన్ ఆక్రమించిన ప్రాంతాలూ ఇందులో కొన్ని ఉన్నాయని, అక్రమంగా దురాక్రమణకు పాల్పడిన ప్రాంతాలను తక్షణమే ఖాళీ చేయాలని పాకిస్థాన్ను హెచ్చరించారు. ఇప్పటికే పలుమార్లు మన అంతర్గత వ్యవహారాలను అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావిస్తూ పాకిస్థాన్ తీవ్రంగా దెబ్బతింటున్న విషయం తెలిసిందే.