ఒత్తిడి: మొసళ్ల చెరువులో దూకి మహిళ ఆత్మహత్య
బ్యాంకాక్: థాయ్లాండ్కు చెందిన ఓ 65ఏళ్ల మహిళ మొసళ్ల చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన బ్యాంకాక్ శివారులోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మొసళ్ల చెరువు వద్ద చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం ఆ చెరువు సందర్శనం ప్రారంభించిన సమయంలోనే ఆ మహిళ చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిందని ఓ సీనియర్ పోలీస్ అధికారి మంగళవారం చెప్పారు.
అక్కడే వున్న పలువురు పర్యాటకులు మొసళ్లకు ఆహార పదార్థాలు వేస్తుండగా.. మహిళ చెరువులో దూకేసింది. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామంతో పర్యాటకులు దిగ్ర్భాంతికి గురయ్యారు. ఆ చెరువులో వందల సంఖ్యలో మొసళ్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
ఆత్మహత్యకు పాల్పడిన మహిళ గత కొన్ని రోజులుగా తీవ్ర ఒత్తిడి, నిరాశకు గురవుతోందని ఆమె సోదరి పోలీసులకు తెలిపింది. పర్యాటకుల రక్షణ కోసం పటిష్ఠ చర్యలు చేపట్టినట్లు పోలీసులు చెప్పారు. ఇక్కడ మొసళ్లతోపాటు పులుల జూ కూడా ఉందని చెప్పారు.
కొన్ని ఫీట్ల ఎత్తు నుంచే పిల్లలు, పెద్దలను మొసళ్లకు ఆహారం వేసేందుకు అనుమతిస్తామని పోలీసులు తెలిపారు. అక్కడ పలువురు శిక్షకులు కూడా ఉంటారని చెప్పారు. వారు మొసళ్లపైన ఎక్కుతూ, వాటి నోట్లో తల పెడుతూ పర్యాటకులను ఆకర్షిస్తారని పోలీసులు చెప్పారు.