భారత్ కీలక నిర్ణయం- ఉక్రెయిన్ లోని ఎంబసీ తరలింపు : ఇక పోలాండ్ లో..!!
ఉక్రెయిన్ లో రష్యా దాడులు కొనసాగుతున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇవాళ్టితో 18వ రోజుకు చేరుకుంది. చర్చలు ఫలితాలను ఇవ్వటం లేదు. ఈసారి ఇజ్రాయెల్లో ఇరుదేశాధినేతలు భేటీ అవనున్నట్టు తెలుస్తోంది. ఇజ్రాయిల్ ప్రధాని నెఫ్తాలి బెన్నెట్ను మధ్యవర్తిగా ఉండాలని జెలెన్ స్కీ కోరినట్లు తెలుస్తోంది. రష్యా పైన ఆంక్షలు పెరుగుతున్నా..యుద్దం విషయంలో ముందుకే సాగుతోంది. ఈ సమయంలో భారత విదేశాంగ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా పోలాండ్ కు మార్చాలని నిర్ణయించింది. ఉక్రెయిన్లో వేగంగా క్షీణిస్తున్న భద్రతా పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా ప్రకటించింది.
ఎప్పటికప్పుడు జరుగుతున్న పరిణామాలను బేరీజు వేస్తూ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఉక్రెయిన్ 18 రోజుల్లో 800కు పైగా క్షిపణులతో దాడి చేసింది. అమెరికా ఇప్పుడు ఉక్రెయిన్కు ఆధునిక వైమానిక రక్షణ వ్యవస్థను ఇవ్వాలని ఆలోచిస్తున్నప్పటికీ, ఇది ఆలస్యం కాదనే భయం ఉంది. ఇదే సమయంలో ఉక్రెయిన్ నగరాల పైన రష్యా దాడులను తీవ్రతరం చేసే అవకాశం కనిపిస్తోంది. ఉక్రెయిన్పై రసాయన ఆయుధాలను వాడొచ్చని నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్బర్గ్ అభిప్రాయపడ్డారు. ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. దీంతో..తాము మరింత అప్రమత్తంగా ఉన్నామని చెప్పుకొచ్చారు.
ఉక్రెయిన్లోని ప్రధాన నగరమైన మెరియుపోల్కు అందుతున్న సాయాన్ని రష్యన్ సేనలు అడ్డుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. నగరాన్ని వీడుతున్న వారిని అడ్డుకుంటున్నాయని తెలుస్తోంది. కీవ్కు 20 కి.మీ దూరంలో ఉన్న ఓ గ్రామం నుంచి ట్రక్కుల్లో వెళుతున్న కొంతమందిపై రష్యన్ సైనికులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో చిన్నారులు, మహిళలు సహా ఏడుగురు పౌరులు మరణించినట్లు ఉక్రెయిన్ వర్గాలు తెలిపాయి.మెరియుపోల్లో ఇప్పటి వరకు 1,500 మంది మరణించినట్లు ఆ నగర మేయర్ కార్యాలయం ప్రకటించింది. ఉక్రెయిన్ ఇప్పటికీ చర్చలకు సిద్ధంగా ఉందని, అయితే లొంగిపోవడానికి సిద్ధంగా లేదని తేల్చి చెప్పింది. ఇజ్రాయెల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు.