దేశాన్నే కదిలించిన రియల్ లవ్ స్టోరీ.. భార్య ప్రాణం కోసం 4 ఏళ్ల పాటు
సినిమాల్లో ప్రేమ కోసం ప్రాణాలు ఇచ్చే పాత్రలను చూసుంటాం. కానీ, చైనాకు చెందిన లియావో డాన్ అనే ఒక సామాన్య ఫ్యాక్టరీ కార్మికుడు.. తన భార్య ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఏకంగా చట్టాన్నే ఎదిరించి, దేశ చరిత్రలోనే అత్యంత విచిత్రమైన మోసగాడిగా నిలిచాడు. చైనా మీడియా ఇతడిని "అత్యంత అంకితభావం గల మోసగాడు" (Most Dedicated Scammer) అని అభివర్ణించింది. ప్రేమ, పేదరికం, చట్టం, వ్యవస్థల మధ్య నలిగిపోయిన ఒక భర్త ఆవేదనకు అద్దం పట్టే ఈ కథ.. ప్రస్తుతం చైనా సోషల్ మీడియాలో వలస కార్మికుల ఆరోగ్య సంరక్షణ సదుపాయాలపై మళ్లీ ఒక పెద్ద చర్చకు దారితీసింది.
లియావో డాన్, ఆయన భార్య డూ జిన్లింగ్ ఒకప్పుడు బీజింగ్లో సాధారణ కార్మికులుగా జీవితాన్ని సాగించేవారు. అయితే, విధి ఆడిన వింత నాటకంలో ఇద్దరూ ఉద్యోగాలు కోల్పోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారు. అదే సమయంలో 2007లో భార్య డూ జిన్లింగ్కు తీవ్రమైన 'యూరేమియా' (కిడ్నీ వైఫల్యం) వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆమె బ్రతకాలంటే వారానికి మూడుసార్లు ఖచ్చితంగా డయాలసిస్ చికిత్స చేయించాలని వైద్యులు తేల్చి చెప్పారు. దీనికోసం ప్రతి నెలా 5,000 యువాన్లకు పైగా ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇది ఆ పేద కుటుంబానికి ఒక మోయలేని భారంగా మారింది.

ఒకే ఒక్క లూప్హోల్.. నకిలీ సీలుతో 4 ఏళ్లపాటు మోసం!
కొద్ది వారాల్లోనే ఆ దంపతులు తమ వద్ద ఉన్న పొదుపు మొత్తాన్ని పూర్తిగా ఖర్చు చేశారు. ప్రభుత్వ వైద్య బీమా కోసం లియావో దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. భార్యకు 'బీజింగ్ హౌస్హోల్డ్ రిజిస్ట్రేషన్' (స్థానిక గుర్తింపు) లేదనే సాంకేతిక కారణంతో అధికారులు ఆ దరఖాస్తును తిరస్కరించారు. మరోవైపు, లియావో స్వయంగా మధుమేహం , తీవ్రమైన పాదాల పుండ్లతో బాధపడుతున్నా, తన ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా భార్యను బ్రతికించుకోవాలనే తీరని ఆరాటంతో ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు.
ఒకరోజు ఆసుపత్రిలో బిల్లులు చెల్లిస్తున్నప్పుడు.. అక్కడి సిబ్బంది కంప్యూటర్ రికార్డులను నిశితంగా పరిశీలించరని, కేవలం రసీదులపై ఆసుపత్రి అధికారిక సీలు ఉందో లేదో మాత్రమే చూస్తారని లియావో గమనించాడు. అంతే.. వెంటనే ఒక నకిలీ సీలు తయారుచేసే వ్యక్తిని కలిసి, ఆసుపత్రి నకిలీ బిల్లులను ఫోర్జరీ చేయడం మొదలుపెట్టాడు. ఈ మోసం ఏకంగా నాలుగు సంవత్సరాల పాటు ఎవరికీ దొరకకుండా సాగింది. దీనివల్ల ఆయన భార్యకు నిరంతరాయంగా డయాలసిస్ చికిత్స అందింది.
కోర్టులో కన్నీళ్లు.. కదిలిపోయిన చైనా జనం!
ఆసుపత్రి యాజమాన్యం 2011లో తమ బిల్లింగ్ వ్యవస్థను అప్గ్రేడ్ చేసినప్పుడు.. కంప్యూటర్ రికార్డులలో దాదాపు 1,72,000 యువాన్ల తేడా రావడంతో లియావో చేసిన ఈ మెగా ఫోర్జరీ వెలుగులోకి వచ్చింది. దర్యాప్తులో ఏకంగా 49 ఫోర్జరీ రసీదులు బయటపడ్డాయి. పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా.. లియావో న్యాయమూర్తి ముందు కన్నీళ్లు పెట్టుకుంటూ, "నాకు వేరే దారి లేని స్థితికి నెట్టబడ్డాను. నా భార్య బ్రతికుండాలని మాత్రమే నేను కోరుకున్నాను, అంతకుమించి నాకు ఏ స్వార్థం లేదు" అని ఆవేదనగా వెల్లడించారు. ఈ సమాచారం దేశవ్యాప్తంగా వ్యాపించడంతో ప్రజల నుండి తీవ్రమైన సానుభూతి వ్యక్తమైంది. దీనిని ఒక 'విషాద ప్రేమకథ'గా అభివర్ణిస్తూ.. చైనా ప్రజలు ఏకంగా 5,00,000 యువాన్ల విరాళాలను సేకరించి ఆసుపత్రి బాకీలను తీర్చేశారు.
ఈ మానవతా దృక్పథాన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. 2012లో లియావోకు సస్పెండ్ చేయబడిన కారాగార శిక్ష (ఇంట్లోనే ఉండి భార్యను చూసుకునే అవకాశం) విధించింది. ఆ సమయంలో ఆయన, "మనిషికి మనస్సాక్షి ఉండాలి.. ఆమె అనారోగ్యంతో ఉంటే చనిపోవడానికి ఎలా వదిలేస్తాను?" అని మీడియాతో అన్నాడు.
ఫలించని పోరాటం..
అయితే, విధి మళ్లీ కళ్లెర్రజేసింది.. అన్ని పోరాటాలు చేసినా, ఆయన భార్య డూ జిన్లింగ్ 2016లో బహుళ అవయవ వైఫల్యంతో మరణించింది. ఈ కథ ముగిసినా, లియావో చేసిన ఈ పోరాటం వల్ల చైనా వైద్య బీమా వ్యవస్థలో పెద్ద మార్పులొచ్చాయి. నేడు అక్కడ యూరేమియా రోగులకు డయాలసిస్ ఖర్చులో 90 శాతం వరకు ప్రభుత్వం తిరిగి చెల్లిస్తోంది.














Click it and Unblock the Notifications