జపాన్ తో అణు ఒప్పందం: చైనా, పాక్ కు షాక్
టోక్యో: భారత ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం జపాన్ ప్రధాన మంత్రి షింజో అబెతో కీలక భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు గురించి క్షుణ్ణంగా చర్చించనున్నారు.
ఈ సమావేశంలో ఇరు దేశాలు 12 ద్వైపాక్షిక సంబంధాలపై పరస్పరం ఒప్పందాలు కుదుర్చుకోనున్నాయి. అందులో కీలకమైన అణు ఒప్పందం కూడా ఉందని అధికారులు ఇప్పటికే వెల్లడించారు.
అణు ఒప్పందం విషయంపై ఇరు దేశాల మధ్య ఇప్పటికే చర్చలు చివరి దశకు చేరుకున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీ, జపాన్ ప్రధాని షింజో అబె రక్షణ, వాణిజ్య, పెట్టుబడులు, భౌగోళిక ప్రాంతాలు, మౌళిక వసతుల అభివృద్ది, నైపుణ్యాభివృద్ది వంటి అంశాలపై చర్చించనున్నారు.
రెండు రోజుల జపాన్ పర్యటనలో భాగంగా టోక్యోలో (శుక్రవారం), కోబేలో (శనివారం) ప్రధాని మోడీ వ్యాపారవేత్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అదే విధంగా జపాన్ కు చెందిన అత్యున్నత వ్యాపారవేత్తలతో ప్రధాని మోడీ పూర్తి స్థాయి చర్చల్లో పాల్గొనబోతున్నారు.
ఈ చర్చలతో పెట్టుబడులు, వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతమవుతాయని తాను ఆశిస్తున్నానని నరేంద్ర మోడీ ట్విట్ చేశారు. అదే విధంగా జపాన్ చక్రవర్తి అకిహిటోతో కూడా ప్రధాని నరేంద్ర మోడీ భేటీ కానున్నారు.
తరువాత జపాన్ లోని ప్రతిపక్ష పార్టీల నాయకులతో మెడీ సమావేశం అయ్యి చర్చించనున్నారు. జపాన్ బయలుదేరిన ప్రధాని మోడీ మార్గం మధ్యలో థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ లో ఆకస్మికంగా దిగారు.
గత నెలలో అనారోగ్యంతో మరణించిన థాయ్ లాండ్ రాజు భూమిబోల్ అదుల్యా దేజ్ కు నివాళులు అర్పించారు. బ్యాంకాక్ లోని గ్రాండ్ ప్యాలెస్ కాంప్లెక్స్ లో దిగవంగత రాజు భూమిబోల్ అదుల్లాదేజ్ కు శ్రద్దాంజలి ఘటించిన తరువాత మోడీ జపాన్ బయలుదేరి వెళ్లారు.
జపాన్ చేరుకున్న ప్రధాని మోడీ అక్కడి హోటల్ లో భారతీయులను కలుసుకున్నారు. భారతీయుల యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. భారతీయులు త్రివర్ణ జెండాలు చేతపట్టుకుని వారి కుటుంబ సభ్యులతో కలిసి మోడీతో ఫోటోలు తీసుకుని సంతోషం వ్యక్తం చేశారు.