తాలిబన్ల అండ: పాకిస్తాన్లో ఒళ్లు విరుచుకుంటోన్న అల్లరిమూక: రంజిత్ సింగ్ విగ్రహం ధ్వంసం
ఇస్లామాబాద్: ఆప్ఘనిస్తాన్ను ఆక్రమించుకోవడం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధపడుతోండటం వంటి పరిణామాలు.. పక్కనే ఉన్న పాకిస్తాన్ పైనా పెను ప్రభావాన్ని చూపుతున్నట్లు కనిపిస్తోంది. ఇన్నిరోజులు స్తబ్దుగా ఉంటూ వచ్చిన మత ఛాందసవాదులు, రాడికల్ గ్రూపులు క్రమంగా ఒళ్లు విరుచుకుంటున్నట్లే ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితికి చేరుకోవడం వల్ల ప్రపంచ దేశాలు.. ప్రత్యేకించి- భారత్ ఎలాంటి విపత్కర పరిణామాలను చవి చూస్తుందోననే అనుమానాలు, భయాందోళనలు ఒకింత వ్యక్తమౌతోన్నాయి.
Recommended Video
Abdul Ghani Baradar: ఆఫ్ఘన్ కొత్త అధ్యక్షుడెవరు?: కరడుగట్టిన తాలిబన్ల లీడర్షిప్ ఇదే
పాకిస్తాన్లో తాజాగా చోటు చేసుకున్న ఘటన ఈ అనుమానాలను మరింత బలోపేతం చేస్తోంది. లాహోర్లో ఏర్పాటైన మహారాజా రంజిత్ సింగ్ విగ్రహాన్ని కొందరు యువకులు ధ్వంసం చేశారు. రంజిత్ సింగ్ అశ్వం మీద కూర్చున్న విగ్రహం అది. దాన్ని ధ్వంసం చేశారు. అశ్వం మీద కూర్చున్నట్టు తీర్చిదిద్దిన మహారాజా రంజిత్ సింగ్ విగ్రహాన్ని నేల కూల్చారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘాతుకానికి పాల్పడిన యువకులను తెహ్రీక్-ఇ-లబ్బాయిక్ పాకిస్తాన్ రాడికల్ గ్రూప్కు చెందిన ప్రతినిధులుగా గుర్తించారు. తెహ్రీక్-ఇ-లబ్బాయిక్ పాకిస్తాన్ గ్రూప్ ప్రతినిధులు ఇదే విగ్రహాన్ని గతంలోనూ ధ్వంసం చేసిన సందర్భాలు ఉన్నాయి. లాహోర్ ఫోర్ట్ కాంప్లెక్స్ ఆవరణలో 2019లో ఈ విగ్రహాన్ని స్థానిక ప్రభుత్వాధికారులు నెలకొల్పారు.
వాలెడ్ సిటీ ఆఫ్ లాహోర్ అథారిటీ, బ్రిటన్కు చెందిన సిక్ హెరిటేజ్ ఫౌండేషన్ దీనికి నిధులను సమకూర్చాయి. వారి విజ్ఙప్తి మేరకు లాహోర్ అధికారులు ఫోర్ట్ కాంప్లెక్స్లో నెలకొల్పడానికి అనుమతి ఇచ్చారు. దీన్ని నిరసిస్తూ అదే ఏడాది తెహ్రీక్-ఇ-లబ్బాయిక్ ప్రతినిధులు దాన్ని ధ్వంసం చేశారు. అఖండ భారత్లో 40 సంవత్సరాలకు పైగా సిక్ సామ్రాజ్యాన్ని ఏకచ్ఛత్రాధిపతిగా పరిపాలించిన మహారాజు రంజిత్ సింగ్. ఆయన 180వ వర్ధంతిని పురస్కరించుకుని పాకిస్తాన్ ప్రభుత్వం లాహోర్ ఫోర్ట్ కాంప్లెక్స్లో ఈ విగ్రహాన్ని నెలకొల్పింది. తొమ్మిది అడుగుల ఎత్తున అశ్వారూఢుడైన రంజిత్ సింగ్ విగ్రహాన్ని కాంస్యంతో రూపొందించింది.
Vandalism in Lahore of the statue of Maharaja Ranjit Singh Ji, the great unifier of India, has to be strongly condemned. This act which attempts to erase the shared history of the subcontinent shows how extremist ideologies feel emboldened in our volatile neighbourhood. pic.twitter.com/aI2wN3QGbe
— Hardeep Singh Puri (@HardeepSPuri) August 17, 2021
తాజాగా పొరుగు దేశం ఆప్ఘనిస్తాన్లో తాలిబన్లు మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోబోతోండటంతో పాకిస్తాన్లోని ఉగ్రవాద గ్రూపులు, రాడికల్ సంస్థలకు మళ్లీ ఊపిరిపోసినట్టయిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. తాలిబన్లతో చేతులు కలపడానికి పాక్ ప్రోత్సాహిత ఉగ్రవాద సంస్థలకు ఎంతో సమయం పట్టకపోవచ్చనే వాదనలు వినిపిస్తోన్నాయి. అదే సమయంలో మతఛాందసవాదులు పేట్రేగిపోవడం మహారాజా రంజిత్ సింగ్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ఈ విగ్రహాన్ని ధ్వంసం చేస్తోన్న వీడియోను కేంద్ర పెట్రోలియం పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ తన ట్విట్టర్లో షేర్ చేశారు. దీన్ని తప్పుపట్టారు. ఇలాంటి చర్యలను ప్రోత్సహించకూడాదని అన్నారు.