పేరడీలపై కొరడా - అలా చేస్తే ట్విట్టర్ అకౌంట్ పర్మనెంట్ బ్లాక్: ప్రముఖ నటి తొలి బలి..!!
వాషింగ్టన్: ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా, ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ఎక్స్ అధినేత, అపర కుబేరుడు ఎలాన్ మస్క్ చేతుల్లోకి వెళ్లిన తరువాత ట్విట్టర్లో పెను సంచలనాలు నమోదవుతున్నాయి. ఒక దాని వెంట ఒకటిగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. కార్పొరేట్ సెగ్మెంట్ మొత్తం నివ్వెరపోయేలా నిర్ణయాలను తీసుకుంటోన్నారు ఎలాన్ మస్క్. ఇన్నేళ్లు సజావుగా సాగుతూ వచ్చిన ట్విట్టర్ కార్యకలాపాల్లో భారీ కుదుపులు సంభవిస్తోన్నాయి.
ఉద్యోగుల తొలగింపు..
ట్విట్టర్లో పని చేసే ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపట్టారు ఎలాన్ మస్క్. దీనిపై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోన్నప్పటికీ పట్టించుకోవట్లేదు. ఉద్యోగాల్లో కోత పెట్టారు. కొత్త ఉద్యోగాల నియామకాలను నిలిపివేశారు. టెక్నికల్, సేల్స్, ప్రొడక్ట్స్, అడ్వర్టయిజ్మెంట్, లీగల్.. ఇలా అన్ని విభాగాల్లోనూ ఉద్యోగుల సంఖ్యను కుదించాలంటూ ఆయా విభాగాల మేనేజర్లందరికీ మెయిల్ పంపించారు. ఈ నెల 1వ తేదీ నుంచే ఉద్యోగులను తొలగించేలా ఎలాన్ మస్క్ చర్యలు తీసుకున్నారు.
పేరడీ అకౌంట్లపై వేటు..
అక్కడితో ఆగట్లేదాయన. ట్విట్టర్లో పేరడీలకు అవకాశం ఇవ్వట్లేదు. అలాంటి వాటిపై అత్యంత కఠినంగా వ్యవహరిస్తోన్నారు. ఈ పేరడీలకు పాల్పడింది ఎవరనేది కూడా చూడట్లేదు. ముందస్తు నోటిఫికేషన్ కూడా ఇవ్వట్లేదు. ఎలాంటి కారణాలు లేకుండానే అధికారిక ట్విట్టర్ అకౌంట్లను బ్లాక్ చేసి పడేస్తోన్నారు. ఈ దిశగా కఠిన ఆదేశాలను జారీ చేశారు. దీనికి అనుగుణంగా స్టాండర్డ్ పాలసీల్లో కూడా మార్పులు చేర్పులు చేసేలా చర్యలు తీసుకుంటోన్నారు.
యూఎస్ కమేడియన్ అకౌంట్ బ్లాక్..
ఎలాన్ మస్క్ తన నిర్ణయాన్ని ప్రకటించిన కొద్ది సేపటికే తొలి వికెట్ పడింది కూడా. అమెరికన్ టాప్ కమేడియన్, నటి క్యాథీ గ్రిఫిన్ బలి అయ్యారు. ఆమె అధికారిక అకౌంట్ను శాశ్వతంగా తొలగించింది ట్విట్టర్ యాజమాన్యం. ఆమె చేసిన పనల్లా ఒక్కటే. తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో ప్రొఫైల్ ఫొటోను మార్చారు. ఎలాన్ మస్క్ ఫొటోను పెట్టారు. అకౌంట్ పేరును కూడా మార్చేశారు. దీన్ని పేరడీగా తీసుకుంది ట్విట్టర్ మేనేజ్మెంట్. ఆమె ప్రొఫైల్ పిక్చర్ను మార్చిన కొద్దిసేపటికే అకౌంట్ బ్లాక్ అయింది.
బ్లూ టిక్ వెరిఫికేషన్..
ప్రస్తుతం బ్లూ టిక్ వెరిఫికేషన్ ఉన్న అకౌంట్ హోల్డర్ల నుంచి ప్రతినెలా ఎనిమిది డాలర్లను వసూలు చేసే ప్రక్రియను ట్విట్టర్ మేనేజ్మెంట్ చేపట్టింది. యాపిల్ ఐఫోన్ వినియోగదారుల కోసం ప్రస్తుతం ఈ ప్రక్రియ అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బ్రిటన్లల్లో ఐఓఎస్లో అందుబాటులో ఉంది. త్వరలో భారత్లోనూ ఈ విధానం అమల్లోకి రానుంది. ఆదాయం తగ్గిపోతోన్న నేపథ్యంలో ఎలాన్ మస్క్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు భావిస్తోన్నారు.
తగ్గుతోన్న ఆదాయం..
ఇదివరకే జనరల్ మోటార్స్ ట్విట్టర్కు యాడ్స్ ఇవ్వడాన్ని నిలిపివేసిన నేపథ్యంలో సంస్థ ఆదాయం తగ్గుముఖం పట్టొచ్చని యూఎస్ మీడియా అభిప్రాయపడుతోంది. జనరల్ మోటార్స్ తరహాలోనే ఫోర్డ్ మోటార్స్, స్టెల్లాంటిస్, వేమోకు చెందిన ఆల్ఫాబెట్ కూడా ట్విట్టర్కు ఇచ్చే తమ వాణిజ్య ప్రకటనలను నిలిపివేయొచ్చనే ప్రచారం సాగుతోంది. అదే జరిగితే- వాణిజ్య ప్రకటనల రూపంలో ట్విట్టర్కు అందే ఆదాయానికి భారీగా గండిపడినట్టే అవుతుంది.
ఈడబ్ల్యూఎస్ కోటాపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం - జడ్జీల్లో భేదాభిప్రాయాలు..!!