ఐఎస్ఐఎస్ అంతం మా లక్షం: బరాక్ ఒబామా
వాషింగ్టన్: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద నాయకులు ఆత్మరక్షణలో పడ్డారని అమెరికా అధ్యక్షుడు ఒరాక్ ఒబామా అన్నారు. అమెరికాలోని సీఐఏ హెడ్ క్వాటర్స్ లో భద్రతాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతరం ఒబామా మీడియాతో మాట్లాడుతూ మిత్రదేశాలతో కలిసి ఐఎస్ఐఎస్ నెట్ వర్క్ ను అంతం చేస్తామన్నారు.
అరబ్ దేశాలతో సహ 66 దేశాలు సభ్యులుగా ఉన్న సంకీర్ణ కూటమి ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను నాశనం చెయ్యడానికి సిద్దం అయ్యిందని గుర్తు చేశారు. ఇటీవల కాలంలో అమాయక ప్రజలను, పిల్లల్ని లక్షంగా చేసుకుని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు అతి కిరాతకంగా దాడులు చేశారని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా విచారం వ్యక్తం చేశారు.
ఇలాంటి దాడులతో ఆ ఉగ్రవాద సంస్థ మీద ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందన్నారు. ఇలాంటి దాడుల ద్వారా ఐఎస్ఐఎస్ తనంతట తానే బలహీనపడుతుందోని ఒబామా అన్నారు. ఇరాక్, సిరియాల్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఇదే సందర్బంలో చెప్పారు.
అయితే గత వేసవి నుంచి ఇప్పటి వరకు ఒక్క దాడిలోనూ ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ విజయవంతం కాలేదన్నారు. కొన్ని నెలలుగా అమెరికా మిత్రదేశాలతో కలిసి ఐఎస్ఐఎస్ స్థావరాల మీద దాడులు చేసిందని, ఈ దాడుల్లో ఉగ్రవాద సంస్థ కీలకనేతల్ని వారు కోల్పోయారని వివరించారు.
ఐఎస్ఐఎస్ ఆర్థిక మూలాల్ని దిగ్బంధించడాన్ని ఇక ముందు కూడా దాడులు కొనసాగిస్తామని ఒబామా స్పష్టం చేశారు. చమురు ద్వారా ఉగ్రవాదులకు వచ్చే ఆదాయాన్ని గణనీయంగా తగ్గించామన్నారు. సిరియా సంక్షోభానికి ముగింపు పలకాలంటే ఇస్లామిక్ స్టేట్ సంస్థను అంతం చెయ్యడం ఒక్కటే మార్గమని ఒబామా పేర్కోన్నారు. దీని కోసం అమెరికా దౌత్య మార్గాల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నదని ఆయన వివరించారు.