మాజీ భార్యపై యాసిడ్ దాడి: 117 సంవత్సరాల జైలు
కరాచీ: మోసం చేసి తనకు విడాకులు ఇచ్చిన భార్య వేరే వ్యక్తిని వివాహం చేసుకుని, సంతోషంగా ఉందని జీర్ణించుకోలేక యాసిడ్ దాడి చేసిన వ్యక్తి కటకటాలపాలయ్యాడు. అతనికి కోర్టు ఏకంగా 117 సంవత్సరాల జైలు శిక్ష విధించి సంచలనమైన తీర్పు వెల్లడించింది.
పాకిస్థాన్ లోని లాహోర్ ముల్తాన్ జిల్లాలో మహమ్మద్ అంజాద్, జూవెదన్ బీబీ దంపతులు నివాసం ఉండేవారు. వీరిద్దరూ కుటుంబ సమస్యలు తదితర కారణాల వలన విడిపోయారు. జూవెదన్ బీబీ భర్తకు విడాకులు ఇచ్చేసింది. తరువాత మహమ్మద్ రియాజ్ అనే వ్యక్తిని రెండవ పెళ్లి చేసుకుంది.
మోసం చేసి తనకు విడాకులు ఇచ్చిన జూవెదన్ బీబీ వేరే వ్యక్తిని వివాహం చేసుకుందని అంజాద్ కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా మాజీ భార్య మీద పగ తీర్చుకోవాలని వేచి చూసిన అంజాద్ యాసిడ్ తీసుకుని మాజీ భార్య జూవెదెన్ బీబీ మీద దాడి చేశాడు.
ఆ సమయంలో ఆమె రెండవ భర్త మహమ్మద్ రియాజ్ మీద యాసిడ్ దాడి జరిగింది. ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పోందుతూ జూవెదెన్ బీబీ మరణించింది. రియాజ్ చికిత్స పోందుతూ ప్రాణాలు రక్షించుకున్నాడు.
కేసు నమోదు చేసిన పోలీసులు అంజాద్ ను అరెస్టు చేశారు. లాహోర్ జిల్లా యాంటీ టెర్రరిజం కోర్టులో కేసు విచారణ జరిగింది. అంజాద్ నేరం చేసినట్లు రుజువు కావడంతో కోర్టు 117 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. జైలు శిక్షతో పాటు రూ. 10 లక్షల జరిమానాను విధించింది.