‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’ రేసులో .. కిమ్ జాంగ్ ఉన్!?
న్యూయార్క్: ది టైమ్ మ్యాగజైన్ 'పర్సన్ ఆఫ్ ది ఇయర్-2017' అవార్డు రేసులో ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ కూడా స్థానం దక్కించుకున్నారు. ఈ అవార్డు కోసం ది టైమ్ మ్యాగజైన్ మొత్తం పది మంది పేర్లతో ఒక జాబితాను విడుదల చేసింది.
అందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫుట్బాల్ ఆటగాడు కోలిన్ కైపెర్నిక్, స్పెషల్ కౌన్సిల్ రాబర్ట్ ముల్లర్లతోపాటు అమెరికాకు కొరకరాని కొయ్యగా మారిన ఉత్తరకొరియా అధ్యక్షుడి పేరు కూడా ఉండడం విశేషం.

ప్రతీయేటా ది టైమ్ మ్యాగజైన్ ఈ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ప్రకటిస్తుంది. ఏడాది కాలంలో మంచికేగానీ, చెడుకేగానీ ఎవరు ఎక్కువగా వార్తల్లో నిలిస్తే ఆయా వ్యక్తులను 'పర్సన్ ఆఫ్ ది ఇయర్'గా టైమ్ మ్యాగజైన్ గుర్తిస్తుంది.
ఇంకా టైమ్ మ్యాగజైన్ ఎంపిక చేసిన జాబితాలో చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్, సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్, 'ది#మీటూ ఉద్యమం', 'వండర్ వుమెన్' డైరెక్టర్ ప్యాటీ జెంకిన్స్, అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ పేర్లు కూడా ఉన్నాయి.
కిమ్ జాంగ్ ఉన్ హయాంలో కేవలం ఈ ఏడాది కాలంలోనే ఉత్తరకొరియా 23 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో ది టైమ్ మ్యాగజైన్ జాబితాలో కిమ్ కూడా చోటు దక్కించుకున్నాడు.












Click it and Unblock the Notifications