ఐస్ బర్గ్ కాదు!: టైటానిక్ ప్రమాదం వెనుక... కొత్త కోణం
అందరు భావిస్తున్నట్లుగా టైటానిక్ మంచు కొండను ఢీకొని మునిగిపోలేదని, బాయలర్లో ఏర్పడిన మంటల కారణంగా మునికిపోయిందని చెబుతున్నారు.
లండన్: టైటానిక్ నౌక ప్రమాదానికి సంబంధించి ఓ ఆసక్తికర విషయం తాజాగా వెలుగు చూసింది. అందరు భావిస్తున్నట్లుగా టైటానిక్ మంచు కొండను ఢీకొని మునిగిపోలేదని, బాయలర్లో ఏర్పడిన మంటల కారణంగా మునికిపోయిందని చెబుతున్నారు.
ఐర్లాండుకు చెందిన ప్రముఖ జర్నలిస్ట్, రచయిత సీనన్ మోలోని తాను రూపొందించిన డాక్యుమెంటరీలో ఈ విషయాన్ని పేర్కొన్నాడు. టైటానిక్ ప్రమాదానికి గల అసలు కారణం తెలుసుకునేందుకు అతను గత 30 ఏళ్లుగా పరిశోధన చేస్తున్నారు.
తన పరిశోధన ప్రకారం టైటానిక్ షిప్ యార్డులో ఉండగానే బాయిలర్లో ఏర్పడిన ఈ మంటల వల్ల నౌక అడుగు భాగం బలహీనంగా మారిందని, బలహీనంగా మారిన ఓడ భాగానే మంచుకొండ ఢీకొన్నదని, దీంతో మునిగిపోయిందని చెబుతున్నారు.
ఐస్ బర్గ్ మాత్రమే కాదు..
1912లో పదిహేను వందల మంది ప్రాణాలు సముద్రంలో కలసిపోవడానికి కారణమైన టైటానిక్ షిప్ కారణమైన విషయం తెలిసిందే. 300 అడుగుల ఐస్ బర్గును ఢీకొట్టి, ముక్కలైందని ఇప్పటి వరకు మనకు తెలుసు. దీని ఆధారంగా సినిమా కూడా వచ్చింది. ఇప్పటి వరకు అందరం అదే నమ్మాం.
30 ఏళ్ల పాటు పరిశోధన
అయితే 30 ఏళ్లుగా టైటానిక్పై అనేక పరిశోధనలు చేసిన సీనన్ మోలోని అవన్నీ కట్టుకథలని తాజాగా తేల్చి చెప్పారు. ఐర్లాండ్కు చెందిన పాత్రికేయుడైన సీనన్ మోలోని కొత్త వాదనతో 'టైటానిక్: ది న్యూ ఎవిడెన్స్' అనే డాక్యుమెంటరీ ప్రసారం కానుంది.
ముక్కలవడానికి..
దీని ప్రకారం.. నౌక భాష్పజనకం(బాయిలర్)లో మంటలే టైటానిక్ ముక్కలై మునిగిపోవడానికి ప్రధాన కారణం. బొగ్గు కారణంగా వెయ్యి డిగ్రీలకుపైగా, అదేపనిగా వెలువడిన అగ్నికీలల వల్ల నౌక హల్ బలహీనంగా మారిపోయింది. ఫలితంగా 75 శాతం బలహీనంగా, పెళుసుగా మారిపోయిన ఉక్కు. చిన్నపాటి తాకిడికీ పగిలిపోయే స్థితికి చేరుకుంది.
బెల్ఫాస్ట్ నుంచి నౌక ప్రారంభం కావడానికి ముందే అది బలహీనంగా ఉంది. నౌకను తయారు చేసిన కంపెనీ అధ్యక్షుడైన జె బ్రూస్ ఇస్మేకు ఈ విషయం తెలుసు. ప్రమాదం జరిగిన తరువాత ఆయన మాట్లాడలేదు.
పెద్దగా దృష్టి పెట్టలేదు
నౌక హల్ బలహీనంగా ఉన్నట్లు ప్రమాదం తర్వాత తీసిన పలు ఫొటోల్లో స్పష్టంగా కనిపిస్తోందని, అయినా ఎవరూ దీనిపై పెద్దగా దృష్టి పెట్టలేదని రీసెర్చ్ చేసిన సెనన్ మోలనీ చెబుతున్నారు. పెద్ద ఐస్ బర్గు వల్ల నౌక విరిగిపోయిందని అందర్నీ నమ్మించారని, ఇది దేవుడు చేసిన చర్య కాదని, అగ్ని, ఐస్, క్రిమినల్ నిర్లక్ష్యం ఫలితంగా సంభవించిన దారుణమన్నారు. కాగా, టైటానిక్పై పలు పుస్తకాలు రాసిన రిచర్డ్ డీ కెర్బ్రెక్ కూడా సీనన్ మోలోని చెప్పింది ఆమోదయోగ్యంగా ఉందన్నారు.