దేశ రక్షణకు కుతంత్రాలైనా చేస్తా, సర్జికల్ వీడియోలు అవసరం లేదు: పారికర్
న్యూఢిల్లీ: కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ గురువారం నాడు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ రక్షణ విషయంలో తాను కుతంత్రాలు పన్నడానికి కూడా తాను సిద్ధమేనని ప్రకటించారు. ఎల్వోసీని దాటి భారత సైన్యం పీవోకేలోని ఉగ్రవాదులపై చేసిన దాడులపై ఆయన మరోసారి స్పందించారు.
న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. భారత సైన్యం జరిపిన దాడులు వందశాతం కచ్చితమైనవని పేర్కొన్నారు. ఉగ్రవాదులను అంతమొందించేందుకు కొన్ని అగ్ర దేశాలు కూడా సర్జికల్ దాడులు చేస్తాయన్నారు. అయితే, భారత సైన్యం జరిపిన దాడుల్లా అవి ఇంతగా విజయవంతం కాలేదన్నారు.
ఆధారాలు విడుదల చేయాలంటూ పలువురు నేతలు డిమాండ్ చేసినంత మాత్రాన వాటిని బయటపెట్టాల్సిన అవసరం లేదని చెప్పారు. తనకు ముక్కుసూటి మనిషిగా పేరుందని పారికర్ చెప్పారు. అయితే, ప్రస్తుతం తాను ఉన్న మంత్రి హోదాలో దేశ భద్రత దృష్ట్యా ముక్కు సూటిగా ఉండాల్సిన అవసరం లేదన్నారు.
రాజకీయ ప్రయోజనాల దృష్ట్యానే కేంద్రం సర్జికల్ దాడులను ప్రచారం చేసుకుంటుందంటూ చేస్తోన్న ప్రతిపక్షాల విమర్శలను ఆయన ఖండించారు. భారత్ చేసిన సర్జికల్ దాడులను ఎంతోమంది పొగుడుతున్నారంటే మన జవాన్లను వారు ప్రశంసిస్తున్నారని దాని అర్థమన్నారు.
ఉగ్రస్థావరాలపై చేసిన సర్జికల్ స్ట్రయిక్స్ వంద శాతం పర్ఫెక్ట్ అన్నారు. ఈసారి దసరాకు సంప్రదాయం ప్రకారం రాంలీలా మైదానంలో కాకుండా ప్రధాని నరేంద్ర మోడీ లక్నోలో వేడుకల్లో పాల్గొంటారని మనోహర్ పారికర్ వెల్లడించారు.