ఉగ్రదాడులు: ఫ్రెంచ్ వ్యంగ్య పత్రిక చార్లీ హెబ్డోకు టాప్ కార్టూనిస్ట్ రాజీనామా
న్యూఢిల్లీ: ఫ్రెంచ్ వ్యంగ వార పత్రిక చార్లీ హెబ్డో కొత్త సమస్యలను ఎదుర్కొంటుంది. చార్లీ హెబ్డోకు చెందిన టాప్ కార్టూనిస్ట్ రెనాల్డ్ లుజియర్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామాకు గల కారణాన్ని వెల్లడించారు. రెనాల్డ్ లుజియర్ మాట్లాడుతూ తన సహచరులను కోల్పోయి ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపానని అన్నారు. నాలుగు నెలలు గడిచినా వారిని మరిచిపోలేకపోతున్నానని, అందుకే ఈ ఉద్యోగం వదిలేయాలనుకున్నట్లు ఆయన తెలిపారు.
చార్లీ హెబ్డో వ్యంగ వార పత్రికలో రెనాల్డ్ లుజియర్ 1992 నుంచి చిత్రకారుడిగా పని చేస్తున్నారు. లుజియర్ తన కలం పేరుతో మహ్మద్ ప్రవక్తపై వేసిన కార్టూన్లను వ్యతిరేకిస్తూ ఈ ఏడాది జనవరిలో ప్యారిస్లోని ఆ పత్రిక ప్రధాన కార్యాలయంపై ఉగ్రవాదులు దాడులు చేసిన సంగతి తెలిసిందే.
ఈ ఉగ్రదాడుల్లో 17 మంది మరణించిన సంగతి తెలిసిందే. మృతులకు సంతాపం తెలుపుతూ శాంతి ఐక్యతా ర్యాలీని కూడా నిర్వహించారు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే. ఈ శాంతి ఐక్యత ర్యాలీలో ఏకంగా పది లక్షల మంది ప్యారిస్ వీధుల్లోకి వచ్చారు. వివిధ దేశాల జెండాలు పట్టుకొని ర్యాలీలో పాల్గొన్నారు.
చనిపోయిన వారి కుటుంబాలకు సంఘీభావంగా లక్షలాది మంది "మీకు మేమున్నాం" అంటూ ప్యారిస్ వీధుల్లో నడిచారు. ఈ శాంతి ప్రదర్శనలో బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్, పాలస్తీనా అధ్యక్షుడు మహ్మాూద్ అబ్బాస్లతో పాటు జర్మనీ ఛాన్సలర్ ఏంజెలో మోర్కల్ దేశాధినేతలు పాల్గొన్నారు.
ఉగ్రవాదుల దాడుల అనంతరం జనవరి నుంచి ఇప్పటి వరకు 4.3 మిలియన్ యూరోలు విరాళాల రూపంలో చార్లీ హెబ్డో మేనేజ్మెంట్కి అందాయని వచ్చిన వార్తలపై కూడా స్పందించారు. పత్రిక కార్యాలయానికి వస్తున్న విరాళాలతో తనకెలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. ఈ ఏడాది సెప్టెంబరులో తాను విధుల నుంచి వైదొలగనున్నట్లు ప్రకటించారు.