బొమ్మ బాంబు పేలి.. ఇద్దరు చిన్నారులతోపాటు తండ్రి మృతి
ఇస్లామాబాద్: ఒక బొమ్మలో పెట్టిన బాంబు పేలి ఇద్దరు చిన్నారులతోపాటు మరో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన పాకిస్థాన్లోని ఖైబర్ పక్థుంఖ్వా ప్రావిన్సులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. స్వాత్ జిల్లాలోని బాషింగ్రమ్ ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది.
బొమ్మ బాంబు పేలుడుతో ఇద్దరు చిన్నారులతోపాటు వారి తండ్రి కూడా మరణించాడని పోలీసులు తెలిపారు. అదే కుటుంబానికి చెందిన మరో ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి.
బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటి ముందు ఆ బొమ్మను గుర్తించిన చిన్నారులు, ఇంట్లోకి తీసుకొచ్చారు. వారు ఆ బొమ్మతో ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో ఇద్దరు చిన్నారులతోపాటు వారి తండ్రి మరణించాడు. కాగా, ఘటనపై విచారణ ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.
ఒక్కరోజులోనే 12 మందికి ఉరి శిక్ష అమలు
తీవ్రమైన నేరాలకు పాల్పడి మరణ శిక్షను పొందిన 12 మందిని ఒక్క రోజులోనే ఉరి తీసినట్లు పాకిస్థాన్ అధికారులు తెలిపారు. ఇంతవరకు ఇలా ఎప్పుడూ జరగలేదని చెప్పారు. హత్య కేసులో నిందితులైన 10 మందిని మంగళవారం ఒక్కరోజులోనే ఉరితీసినట్లు పంజాబ్ ప్రావిన్స్ హోంమంత్రి షుజా ఖంజదా తెలిపారు. కరాచీలోని జైలులో ఉన్న మరో ఇద్దరు దోషులను కూడా ఇదే రోజున ఉరితీసినట్లు జైలు అధికారి ఒకరు చెప్పారు. మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించినట్లు తెలిపారు.