కిమ్ జోంగ్ ఆ ట్రైన్లోనే ఉన్నాడా... నియంత మిస్సింగ్పై ఆసక్తికర కథనం...
ప్రపంచానికి ఇది 2020వ సంవత్సరం. కానీ ఉత్తర కొరియాకు మాత్రం 107వ సంవత్సరం. ఉత్తర కొరియా గురించి ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ అంతం చేసినా కిమ్ జోంగ్ ఉన్ నియంతృత్వం తప్ప మరేమీ కనిపించదు. ప్రపంచం ఇంత శాస్త్ర సాంకేతికత అభివృద్దిని సాధించిందని చెప్పుకుంటున్న ప్రస్తుత తరుణంలోనూ.. ఉత్తర కొరియా మాత్రం ఇప్పటికీ ప్రపంచానికి మిస్టరీ దేశంగానే మిగిలిపోయింది. ఉత్తర కొరియాలో ఏం జరుగుతుందో ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి ఎవరికీ అవకాశం లేదు. ఆ దేశంలో అడుగుపెట్టడానికి అనుమతి దొరకడమే గగనం.
Recommended Video
దొరికినా.. మీరు వేసే ప్రతీ అడుగు ఆంక్షలు,నిఘా నడుమ సాగాల్సిందే. అందుకే ఉత్తరకొరియా గురించి ఇతర దేశస్తులు చెప్పే ఊహాగానాలు,అంచనాలు తప్ప.. అక్కడి ప్రజలు స్వయంగా వెల్లడించిన విషయాలేవీ ఎక్కడా అందుబాటులో లేవు. ఇప్పటికీ మిస్టరీ దేశంగానే ఉన్న ఉత్తర కొరియాలో.. ఇప్పుడు ఆ దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆచూకీ కూడా మిస్టరీగా మారిపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఆయన ఆచూకీపై తాజాగా ఓ ఆసక్తికర కథనం తెర పైకి వచ్చింది.
ఆ ట్రైన్లో కిమ్ ఉన్నాడా..
ఉత్తర కొరియాలోని ఈస్ట్ కోస్ట్లో కిమ్ జోంగ్ ఉన్ హాలీడే వెకేషన్లో ఉన్నాడన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి బలం చేకూర్చేలా... కిమ్ మాత్రమే ఉపయోగించే లీడర్షిప్ స్టేషన్లో ఏప్రిల్ 21, 23న అక్కడ ఓ ట్రైన్ కనిపించిందని వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే 38 నార్త్ అనే సంస్థ వెల్లడించింది. శాటిలైట్ దృశ్యాల ద్వారా ఈ విషయాన్ని కనిపెట్టినట్టు తెలిపింది. ఆ ట్రైన్ కూడా కిమ్ ఫ్యామిలీకి ప్రత్యేకమని.. వారు మాత్రమే దాన్ని ఉపయోగిస్తారని చెప్పింది. అయితే ఆ ట్రైన్ అక్కడున్నంత మాత్రానా.. అందులో కిమ్ ఉన్నాడని కచ్చితంగా చెప్పలేమన్నది.
అనారోగ్యంతో కిమ్..?
ఏప్రిల్ 15న కిమ్ తన తాత కిమ్ ఇల్ సంగ్ 108 జయంతి వేడుకలకు గైర్హాజరవడంతో ఆయన ఆరోగ్యం వదంతులు మొదలయ్యాయి. 2011లో అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి క్రమం తప్పకుండా కిమ్ ఈ వేడుకలకు హాజరవుతున్నారు. ఉత్తర కొరియాకు జాతీయ పండుగ లాంటి ఈ వేడుకలకు కిమ్ హాజరుకాకపోవడం చాలామందిని విస్మయానికి గురిచేసింది. ఇటీవలే చైనా ఉత్తర కొరియాకు మెడికల్ టీమ్స్ను కూడా పంపించిందని రాయిటర్స్ వెల్లడించడం కిమ్ అనారోగ్యంతో ఉన్నాడన్న కథనాలకు బలం చేకూర్చింది.
నిజంగానే అనారోగ్యమా.. లేక..
కిమ్ జోంగ్ ఉన్కు గుండె ఆపరేషన్ జరిగిందని.. సర్జరీ తర్వాత ఆయన ఆరోగ్యం విషమించిందని ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. స్విట్టర్లాండ్లో స్కూలింగ్ చేసిన నాటి నుంచి కిమ్కు జున్ను తినడమంటే చాలా ఇష్టం. తన కోసం ప్రత్యేకంగా ఇతర దేశాల నుంచి ఉత్తర కొరియాకు జున్ను తెప్పించుకుంటాడు. అధికంగా జున్ను తినడం వల్లే కిమ్ బరువు పెరిగిపోయాడని చెబుతారు. ఆయన గుండె సంబంధిత వ్యాధితో బాధపడటానికి అదే కారణమన్న వాదనలు కూడా ఉన్నాయి. మొత్తం మీద కిమ్ జోంగ్ ఉన్ మిస్టరీ ఇప్పుడు ప్రపంచాన్ని ఉత్కంఠకు గురిచేస్తోంది. కిమ్ మరణం అంచుల్లో ఉన్నాడా... లేక ప్రపంచమంతా తన గురించి మాట్లాడుకోవాలని కావాలనే అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడా అన్నది అంతుచిక్కడం లేదు.