18 నెలల్లోగా సొంతదేశానికి వెళ్లిపోవాలి: ట్రంప్ సర్కార్ అల్టిమేటం
అమెరికాలో తలదాచుకుంటున్న సుమారు 60 వేల మంది హైతీ దేశస్థులు అమెరికాను విడిచి సొంత దేశానికి వెళ్లిపోవాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. అమెరికాను విడిచి వెళ్లేందుకు వారికి 18 నెలల గడువు ఇచ్చింది.
వాషింగ్టన్: అమెరికాలో తలదాచుకుంటున్న సుమారు 60 వేల మంది హైతీ దేశస్థులు అమెరికాను విడిచి సొంత దేశానికి వెళ్లిపోవాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. అమెరికాను విడిచి వెళ్లేందుకు వారికి 18 నెలల గడువు ఇచ్చింది.
కరేబియన్ దేశమైన హైతీలో 2010లో తీవ్ర భూకంపం వచ్చింది. దాని ధాటికి హైతీ ఛిన్నాభిన్నమైంది. అసలే తీవ్రమైన పేదరికాన్ని అనుభవిస్తున్న అక్కడి ప్రజలకు జీవనోపాధి కరవైంది.
ఈ నేపథ్యంలో సుమారు 60 వేల మంది హైతీ ప్రజలు అమెరికాలో నివాసముండొచ్చని, ఉపాధిని పొందవచ్చుని అమెరికా ప్రభుత్వం తత్కాలిక అనుమతి ఇచ్చింది. అయితే హైతీలో ప్రస్తుతం పరిస్థితి మెరుగ్గానే ఉందంటూ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ సమాచారం ఇవ్వడంతో ట్రంప్ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

హైతీ ప్రజలు తమ సొంత దేశానికి వెళ్లిపోవాలని, జూలై 22, 2019 వరకు మాత్రమే అమెరికాలో నివసించే అనుమతి ఇస్తున్నామని, వెళ్లిపోవడానికి ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది.
అయితే ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అమెరికాలో నివసిస్తున్న హైతీ ప్రజల నుంచి భిన్నమైన స్వరాలు వినపడుతున్నాయి. హైతీలోని పరిస్థితుల్లో పెద్దగా మార్పు రాలేదని వాపోతున్నారు.
ట్రావెల్ బ్యాన్ పై సుప్రీంకోర్టుకు...
మరోవైపు తన ట్రావెల్ బ్యాన్ ఉత్తర్వులపై ట్రంప్ అమెరికా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇటీవలే సవరించి కొత్తగా రూపొందించిన ఆరు దేశాల పౌరులపై ట్రావెల్ బ్యాన్ను పాక్షికంగా అమలుచేయాలనే ఫెడరల్ అప్పీల్స్ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
యూఎస్ జస్టీస్ డిపార్ట్మెంట్ అధికారులు ఈ మేరకు సుప్రీం కోర్టుకు అప్పీలు చేశారు. ట్రావెల్ బ్యాన్ను పూర్తిగా అమలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఆ మధ్య ట్రంప్ ప్రభుత్వం.. చాద్, ఇరాన్, లిబియా, ఉత్తరకొరియా, సోమాలియా, సిరియా, యెమెన్తోపాటు వెనిజులాకు చెందిన కొంతమంది పౌరులు అమెరికాలో అడుగుపెట్టకూడదంటూ ట్రావెల్ బ్యాన్ను రూపొందించిన సంగతి తెలిసిందే.
అయితే ఆయా దేశాల పౌరులకు సంబంధించిన వ్యక్తుల అమెరికాలో ఉన్నప్పుడు ట్రావెల్ బ్యాన్ విధించడం సరికాదని, ఈ వెసులుబాటు కల్పించని కారణంగా ప్రభుత్వ ప్రతిపాదనను నిలిపివేస్తున్నామంటూ హవాయి కోర్టు జడ్జి ట్రావెల్ బ్యాన్ ఉత్తర్వులను నిలిపివేశారు. దీనిపై తాజాగా ట్రంప్ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది.












Click it and Unblock the Notifications