కరోనా రోగుల మరణాలను వైద్యులు పెంచుతున్నారు..? డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ బిజీగా ఉన్నారు. క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. అయితే వైద్యులపై ట్రంప్ అక్కసును వెళ్లగక్కారు. కరోనా వైరస్ మరణాల సంఖ్యను పెంచుతున్నారని ఆరోపించారు. వారికి కావాల్సింది డబ్బులే గాక మరొటి కాదన్నారు. అందుకోసమే ఆస్పత్రులలో వైద్యం చేసుకునేవారికి చికిత్స అందించి.. మిగిలినవారిని వదిలేస్తున్నారని.. దీంతో చాలా మంది చనిపోతున్నారని నిరాధార ఆరోపణలు చేశారు.
Recommended Video
మిచిగాన్ వాటర్ ఫోర్డ్ టౌన్ షిప్లో ట్రంప్ శుక్రవారం ప్రచారం చేశారు. వైద్యులు స్మార్ట్గా పనిచేస్తున్నారని ఆరోపించారు. అధిక డబ్బుల కోసం తప్పుడు పనులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతీ ఒక్కరు ఏదో ఒక సందర్భంలో చనిపోతారని.. కానీ వైద్యులు చేసే పని మాత్రం బాగోలేదన్నారు. అయితే ట్రంప్ ఆరోపణలకు సంబంధించి ఏ ఆధారం లేదు. ఊరికనే తన ప్రసంగంలో కామెంట్ చేశారు. వైద్య సిబ్బందిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేశారు.
గత వందేళ్లలో ఎన్నడూ లేనివిధంగా కరోనా వైరస్ దాడి చేస్తుంటే.. ట్రంప్ మాత్రం కామెంట్ చేసి ఊరుకున్నారు. అమెరికాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. కోటీ కేసులకు దగ్గరలో ఉంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. శీతకాలం కావడంతో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గత వారం కంటే కేసులు పెరిగే అవకాశం ఉంది అని ఆందోళన చెందుతున్నారు.
వైద్యుల ఆందోళన ఇలా ఉంటే.. ట్రంప్ మాత్రం తన నోటి దురుసును ప్రదర్శించారు. వైద్యుల లక్ష్యంగా ఆరోపణలు చేశారు. మార్చి 1 నుంచి ఆగస్ట్ 1 వరకు సాధారణం కంటే 20 శాతం మరణాలు సంభవించాయి. ఇదీ కూడా ట్రంప్ విమర్శలు చేసేందుకు దారితీసింది. అయితే అమెరికా మెడికల్ అసోసియేషన్ కూడా రోగుల సంఖ్యను పెంచారనే ఆరోపణలను ఖండించింది.