Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

యుద్ధంలోకి అమెరికా నేవీ.. హార్మూజ్ జలసంధి అష్టదిగ్బంధనం.. ట్రంప్ సంచలన వార్నింగ్

పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్- అమెరికా మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమైన విషయం తెలిసిందే. దాంతో అమెరికా, ఇరాన్ బృందాలు అక్కడినుంచి వెనక్కి వెళ్లిపోయాయి. ఈ విషయాన్ని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్​ వెల్లడించారు. ఇస్లామాబాద్ వేదికగా దాదాపు 21 గంటలకు పైగా జరిగిన చర్చలు విఫలం అయ్యాయని తెలిపారు. అయితే ఇరాన్ మాత్రం అమెరికా మితిమీరిన డిమాండ్స్ కారణంగానే చర్చలు విఫలమయ్యాయని చెబుతోంది. అయితే ఇరాన్- అమెరికా మధ్య చర్చలు ఫెయిల్ అయిన నేపథ్యంలో ట్రంప్ ఆదివారం సంచలన ప్రకటన చేశారు.

ఇరాన్ యుద్ధ పరిష్కార చర్చలు పాకిస్థాన్ లో విఫలమవడంతో.. హార్ముజ్ జలసంధిని దిగ్బంధనం చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. మేరీల్యాండ్ లోని జాయింట్ బేస్ ఆండ్రూస్‌లో ఎయిర్ ఫోర్స్ వన్ ఎక్కే ముందు విలేకరులతో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అనంతరం ఇదే విషయాన్ని తన ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ దీన్ని వెల్లడించారు.

"ఇరాన్ అక్రమ బలవంతపు దోపిడీని ఆపేందుకు ఈ దిగ్బంధనం తక్షణమే అమల్లోకి వస్తుంది. ప్రపంచంలోనే అత్యుత్తమమైన అమెరికా నావికాదళం, హార్ముజ్ జలసంధిలోకి వచ్చే లేదా వెళ్లే నౌకలన్నింటినీ అడ్డుకుంటుంది" అని పేర్కొన్నారు. ఈ దిగ్బంధనంలో ఇతర దేశాలు కూడా పాల్గొంటాయని ఆయన స్పష్టం చేశారు.

ఇస్లామాబాద్ శాంతి చర్చలు యుద్ధానికి ముగింపు పలుకుతాయని భావించిన ఆశలను ఈ ప్రకటన నీరుగార్చింది. యుద్ధం మొదలైనప్పటి నుండి ఇరాన్ జలసంధిని నియంత్రించడం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు ఇప్పటికే తీవ్ర సంక్షోభంలో ఉన్నాయి. ప్రపంచ చమురులో ఐదో వంతు రవాణా చేసే ఈ వ్యూహాత్మక మార్గం దిగ్బంధనం, సంక్షోభాన్ని మరింత పెంచుతుంది.

Trump Directs US Navy to Block Strait of Hormuz in Major Escalation Move Trump blocks Hormuz Strait

ఇరాన్ జలసంధిపై నియంత్రణ సాధించి, ప్రపంచం నష్టపోతుంటే ఆర్థికంగా లాభపడకుండా నిరోధించడమే అమెరికా దిగ్బంధన లక్ష్యమని ట్రంప్ వివరించారు. "ఒకానొక దశలో, నౌకలన్నీ లోపలికి రావడానికి, బయటికి వెళ్లడానికి అనుమతి లభిస్తుంది. కానీ 'ఎక్కడో మైన్ ఉండవచ్చు' అని ఇరాన్ తమకు తప్ప ఎవరికీ తెలియని విధంగా చెబుతూ అనుమతించడం లేదు" అని వివరించారు.

ఇది ప్రపంచాన్ని బ్లాక్‌మెయిల్ చేయడమేనని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. "దేశాధినేతలు, ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ ఎప్పటికీ బ్లాక్‌మెయిల్ చేయబడవు" అని ఆయన గట్టిగా చెప్పారు. ఈ అక్రమ చర్యలను ఇరాన్ ఆపకపోతే దిగ్బంధనం కొనసాగుతుందని ఆయన పరోక్షంగా హెచ్చరించారు.

ఇరాన్‌కు రుసుము చెల్లించిన ఏ నౌకనైనా అంతర్జాతీయ జలాల్లో గుర్తించి అడ్డుకోవాలని అమెరికా నావికాదళాన్ని ఆదేశించినట్లు ట్రంప్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇది ఇరాన్ అధికారానికి ఒక సవాలు. రెండు వారాల కాల్పుల విరమణ సమయంలో ఇరాన్ నౌకల ప్రయాణాలపై రుసుము వసూలు చేయాలని ప్రయత్నిస్తోంది. టెహ్రాన్ ఈ మార్గంపై పట్టు సాధించే ప్రయత్నాల్లో ఉండటంతో ట్రంప్ ఆగ్రహం చెందారు. "చట్టవిరుద్ధమైన రుసుము చెల్లించిన ఎవరికీ అంతర్జాతీయ జలాల్లో సురక్షిత ప్రయాణం ఉండదు" అని అధ్యక్షుడు స్పష్టం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+