పాట ఆపని ట్రంప్.. 'భారత్- పాక్ యుద్ధం ఆపింది నేనే'..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ పాత పాటే పాడుతున్నారు. భారత్- పాకిస్థాన్ మధ్య యుద్ధం తానే ఆపేశానని చెప్పుకొచ్చారు. అణ్వాయుధాలు కలిగిన దేశాలైన భారత్- పాకిస్థాన్ ల మధ్య చాలా పెద్ద యుద్ధాన్ని తాను నిలిపివేసినట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 22 న జరిగిన పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఇరు దేశాల మిలిటరీ అధికారుల చర్చల తర్వాత భారత్ సీజ్ ఫైర్ ప్రకటించింది. కానీ ట్రంప్ మాత్రం తనవల్లే యుద్ధం ఆగిపోయిందంటూ పదే పదే చెప్పుకుంటున్నారు. ఇప్పటికీ అనేక వేదికల్లో ఈ విషయాన్ని ప్రస్తావించిన ట్రంప్.. తాజాగా క్వాంటికోలో మిలిటరీ అధికారులతో జరిగిన సమావేశంలో తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు ట్రంప్.
" నేను చాలా యుద్ధాలను సెటిల్ చేశాను. అందుకే మనం ఇక్కడ ప్రశాంతంగా ఉన్నాం. 9 నెలల్లో ఏడు యుద్ధాలు ఆపేశా. నిన్న అన్నింటికంటే అతిపెద్ద యుద్ధాన్ని ఆపేశాం. పాకిస్థాన్- భారత్ యుద్ధాన్ని కూడా ఆపేశా. అవి న్యూక్లియర్ పవర్ కలిగిన దేశాలు" అని చెప్పుకొచ్చారు ట్రంప్.
మరోవైపు ఇజ్రాయెల్- గాజా సంక్షోభంపైనా ట్రంప్ మాట్లాడారు. ఇప్పటికే అమెరికా 21 సూత్రాల శాంతి ప్రణాళికను ప్రతిపాదించింది. గాజా యుద్ధ విరమణతోపాటు భవిష్యత్తులో పాలస్తీనా దేశం ఏర్పాటుకు వీలుగా ఈ శాంతి ప్రణాళికను రూపొందించింది. అలాగే హమాస్ వద్ద బందీలుగా ఉన్నవారిని కూడా వెంటనే రిలీజ్ చేయాలన్న ప్రతిపాదనలు అందులో ఉన్నాయి. అయితే ఇదే విషయంపై ట్రంప్ తాజాగా వ్యాఖ్యానించారు. మనం ఈ వివాదాన్ని పరిష్కరించామని అనుకుంటున్నానని.. ఏం జరుగుతుందో చూడాలని అన్నారు. తమ నిబంధనలను హమాస్ అంగీకరించాలని ట్రంప్ నొక్కి చెప్పారు. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అన్నారు.

ఇక భారత్- పాకిస్థాన్ యుద్ధంపై మే 10 నుంచి సామాజిక మాధ్యమాల వేదికగా అలాగే పలు అంతర్జాతీయ వేదికల్లోనూ ట్రంప్ పాత పాట మళ్లీ మళ్లీ పాడుతూ వస్తున్నారు. మే 10న చేసిన తన ట్రూత్ సోషల్ లో పెట్టిన పోస్టులో భారత్, పాకిస్థాన్.. పూర్తిగా, తక్షణమే సీజ్ ఫైర్ కు అంగీకరించాయని.. అమెరికా మధ్యవర్తిత్వంతో లాంగ్ నైట్ టాక్స్ కారణంగా ఇది సాధ్యమైందని తెలిపారు. ట్రంప్ ఈ మాటను 50 సార్లు చెప్పారు.












Click it and Unblock the Notifications