అమెరికాను లెక్కచేయని టర్కీ..! శివాలెత్తిపోతున్న ట్రంప్..!!
అంకారా/హైదరాబాద్ : అసలే అంతంత మాత్రంగా ఉన్న అమెరికా-టర్కీ సంబంధాలు రోజురోజుకూ దిగజారిపోతున్నాయి. అగ్రరాజ్యం ఎంత హెచ్చరిస్తున్నా ఖాతరు చేయకుండా నాటో దేశమైన టర్కీ రష్యా నుంచి ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థ డెలివరీ తీసుకొంది. దీంతో టర్కీపై ఆంక్షలు విధించడంతో పాటు నాటోలో టర్కీ స్థానానికి కూడా ఎసరు తేవాలని అమెరికా భావిస్తోంది.
ఇప్పటికే తమ దేశం పూర్తి సార్వభౌమత్వంతో ఎస్-400ను కొనుగోలు చేసిందని టర్కీ అధ్యక్షుడు తైయిప్ ఎర్డగాన్ ప్రకటించారు. రష్యాకు చెందిన కార్గో విమానం నుంచి ఎస్400 ట్రక్కులను దించుతున్న ఫుటేజీని టర్కీ టెలివిజన్ ప్రసారం చేసింది. టర్కీ ఎస్-400 డెలివరీ తీసుకొన్న విషయం మాకు తెలుసు. టర్కీ అధ్యక్షుడు ఎర్డగాన్తో ట్రంప్ జీ20 సదస్సులోనే మాట్లాడారు. ఇది ఒక సమస్య.. దీనిపై మరో ప్రశ్నేలేదు' అని చెప్పినట్లు ట్రంప్ కార్యవర్గంలోని ఒక అధికారి వెల్లడించారు. మరోపక్క నాటో కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేసింది.
2003లో ఇరాక్తో యుద్ధ సమయంలో టర్కీ భూభాగాన్ని వాడుకొనేందుకు అమెరికాకు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఆ తర్వాత ఇవి క్షీణిస్తూ వస్తున్నాయి. ఒబామా సమయంలో తొలుత ఈ సంబంధాలు కొంత మెరుగుపడినా.. ఆ తర్వాత ఐసిస్ పై యుద్ధ సమయంలో సిరియాలోని కుర్దిష్ దళాలకు శిక్షణ ఇచ్చే విషయంలో విభేదాలు రేగాయి. కుర్దులను టర్కీ ఉగ్రవాదులుగా చూడటమే దీనికి కారణం.
ఆ తర్వాత అమెరికాలో ఉన్న ఫెతుల్లా గులేన్ అనే మత గురువు 2016 ఎర్డగాన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నినట్లు ఆరోపించారు. ఈ నేపథ్యంలో అతన్ని అప్పగించేందుకు అమెరికా నిరాకరించింది. గత ఏడాది అమెరికా పాస్టర్ ఆండ్రూ బ్రాన్సన్ను టర్కీ అధికారులు బంధించి జైల్లో వేశారు. ఇది అమెరికా ఆగ్రహానికి కారణమైంది. ఆ సమయంలో అమెరికా ఆంక్షలు విధించింది. అప్పటికే రెండంకెల ద్రవ్యోల్బణంతో అవస్థలు పడుతున్న టర్కీలో నిరుద్యోగిత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగింది.