ఉద్యోగులు ఆఫీసుకు రావద్దు.. ట్విట్టర్ కీలక ప్రకటన.. ఎందుకంటే..?
ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లో పనిచేస్తున్న ట్విట్టర్ ఉద్యోగులెవరూ తమ ఆఫీసులకు వెళ్లవద్దని ట్విట్టర్ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. సోమవారం(మార్చి 2) నుంచి ఇంటి వద్ద నుంచే పనిచేయాలని సూచించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ట్విట్టర్ ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తిని నియంత్రించడమే తమ ముఖ్య ఉద్దేశమని.. అందుకే తమ ఉద్యోగులందరిని ఇంటి నుంచే పనిచేయాల్సిందిగా ఆదేశించామని ట్విట్టర్ హెచ్ఆర్ చీఫ్ జెన్నిఫర్ క్రిస్టీ తెలిపారు.
దక్షణి కొరియా,హాంకాంగ్,జపాన్లో పనిచేస్తున్న ట్విట్టర్ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ తప్పనిసరి చేసినట్టు చెప్పారు.దక్షిణ కొరియాలో దాదాపు 5,000 మందికి కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది.
చైనా తర్వాత ఆ స్థాయిలో దక్షిణ కొరియాలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు 28 మంది మృతి చెందారు. అటు జపాన్ ప్రభుత్వం కూడా దేశంలోని పాఠశాలలన్నింటిని మూసివేసింది. సంస్థలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేసేలా చూసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 90వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO) ప్రకటించింది. అలాగే 3100 మంది కరోనా సోకి మృతి చెందినట్టు తెలిపింది. కరోనా విస్తరించిన దేశాలన్నీ అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరింది. అటు చైనాలో గత జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో కొత్త కేసులు తక్కువగా నమోదవుతున్నట్టు చెప్పింది. మంగళవారం కొత్తగా 125 కేసులు నమోదైనట్టు వెల్లడించింది.












Click it and Unblock the Notifications