చేతులు మారిన ట్విట్టర్: టేకోవర్ చేసిన ఎలాన్ మస్క్: చరిత్రలోనే అతి పెద్ద డీల్: షేర్ హోల్డర్ల పంట
వాషింగ్టన్: కొద్దిరోజులుగా వార్తల్లో ఉంటూ వస్తోన్న టాప్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్.. ట్విట్టర్ కొనుగోలు వ్యవహారం ముగిసింది. ప్రైవేట్ అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్ఎక్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ తయారీ కంపెనీ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చేతికి వెళ్లింది. ట్విట్టర్ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేశారు. ఇప్పుడాయన ట్విట్టర్కూ కొత్త అధిపతి అయ్యారు. దీనికోసం ఎలాన్ మస్క్ ఇచ్చిన ఆఫర్ విలువ 44 బిలియన్ డాలర్లు. ఇప్పుడున్న ట్విట్టర్ యాజమాన్యానికి ఎలాన్ మస్క్ చెల్లించిన మొత్తం ఇది. కార్పొరేట్ చరిత్రలోనే అతి పెద్ద డీల్గా భావిస్తున్నారు.
ఆ ప్రతిపాదనలకు ఆమోదం..
ట్విట్టర్ను ఎలాన్ మస్క్కు విక్రయించే ప్రతిపాదనలను ఆమోద ముద్ర వేశారు ఆ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు. ఈ విషయాన్ని ట్విట్టర్ ధృవీకరించింది. అమెరికా కాలమానం ప్రకారం.. సోమవారం సాయంత్రం దీనిపై ఓ ప్రకటన విడుదల చేసింది. 44 బిలియన్ డాలర్లకు తమ సంస్థను ఎలాన్ మస్క్కు విక్రయించడానికి అంగీకరించినట్లు ప్రకటించింది. ఎలాన్ మస్క్ చేసిన టేకోవర్ ప్రతిపాదనలను కొద్దిరోజులుగా సమీక్షిస్తూ వచ్చామని, ఆ ప్రక్రియ సానుకూలంగా ముగిసిందని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ చీఫ్ బ్రెట్ టేలర్ తెలిపారు.
44 బిలియన్ డాలర్లకు ఓకే..
నిజానికి- ఈ సోషల్ మీడియా జెయింట్ ప్లాట్ఫామ్ను కొనుగోలు చేయడానికి మొదట్లో ఎలాన్ మస్క్ ఇచ్చిన ఆఫర్- 46.5 బిలియన్ డాలర్లు. డీల్ కుదిరే సమయానికి రెండున్నర బిలియన్ డాలర్ల మొత్తం తగ్గింది. 44 బిలియన్ డాలర్లతో ఈ డీల్ ఓకే అయింది. ఈ టేకోవర్ వ్యవహారంతో ట్విట్టర్ షేర్ హోల్డర్ల పంట పండినట్టే. ఒక్కో షేర్కు 54.20 డాలర్లను ఎలాన్ మస్క్ చెల్లిస్తారు. ఈ విషయాన్ని ఆయన ఇదివరకే ప్రకటించారు. దీన్ని ఈ ఒప్పందంలోనూ పొందుపరిచారు.
ఏకగ్రీవంగా అంగీకారం..
ట్విట్టర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో 11 మంది సభ్యులు ఉన్నారు. ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్య కార్యనిర్వహణాధికారి జేక్ డోర్సీ ఇందులో ఒకరు. ఎలాన్ మస్క్ ఇచ్చిన ఆఫర్పై సమగ్రంగా సమీక్ష, అధ్యయనం చేసింది. దీనికోసం జేపీ మోర్గాన్ అండ్ కంపెనీని నియమించుకుంది. ఈ కంపెనీ నుంచి అందిన నివేదికపై సమగ్రంగా సమీక్షించింది. అనంతరం మస్క్ ఇచ్చిన ఆఫర్పై ఆమోదముద్ర వేసింది. ట్విట్టర్ బోర్డ్ డైరెక్టర్లందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఎవరూ ఎలాంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేయలేదు.
ట్విట్టర్ షేర్లు.. జూమ్
కార్పొరేట్ సెగ్మెంట్లోనే అతి పెద్ద టేకోవర్గా చెబుతున్నారు. యాజమాన్య బదలాయింపు ప్రక్రియ మొత్తాన్నీ మూడునెలల వ్యవధిలో పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ సమాచారం వెలువడిన వెంటనే ట్విట్టర్ షేర్ల ధరలు రాకెట్లా దూసుకెళ్లాయి. ఒక్కసారిగా ఆరుశాతం మేర వాటి రేట్లు పెరిగాయి. ఈ ప్రతిపాదనలు తెరమీదికి వచ్చినప్పటి నుంచీ న్యూయార్క్ స్టార్ ఎక్స్ఛేంజ్లో ట్విట్టర్ షేర్ల ధరలు అధికమౌతూనే వస్తున్నాయి. ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు ఒక్కో షేర్ ధర 77 డాలర్ల మేర పెరిగింది.
భావప్రకటన స్వేచ్ఛకు..
ట్విట్టర్ నుంచి అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే ఎలాన్ మస్క్ ఓ ప్రకటన విడుదల చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛకు అనుకూలంగా ట్విట్టర్ను తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యానికి భావ ప్రకటన స్వేచ్ఛ అనేది పునాదిలాంటిదనే విషయాన్ని తాను బలంగా విశ్వసిస్తానని వ్యాఖ్యానించారు. ఇందులో ఎన్నో సరికొత్త ఫీచర్లను తీసుకొస్తానని చెప్పారు. ఇకపై డిజిటల్ టౌన్ స్క్వేర్గా ట్విట్టర్ మారుతుందని తేల్చి చెప్పారు. భావ ప్రకటన, మానవత్వంపై స్వేచ్ఛగా డిబేట్స్ జరిగేలా దీన్ని తీర్చిదిద్దుతానని అన్నారు.
స్వాగతించిన పరాగ్ అగ్రవాల్..
11 మంది సభ్యులతో కూడిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ట్విట్టర్ ముఖ్య కార్యనిర్వహణాధికారి, భారతీయుడు పరాగ్ అగ్రవాల్ స్వాగతించారు. అతి పెద్ద డీల్ను కుదుర్చుకున్నందుకు గర్వంగా భావిస్తున్నానని చెప్పారు. ఇకపై వినియోగదారులకు మరింత అనుకూలంగా ఈ ప్లాట్ఫామ్ ఉంటుందని చెప్పారు. బోర్డు డైరెక్టర్లు తీసుకున్న ఈ నిర్ణయం ట్విట్టర్లో పని చేసే ప్రతి ఉద్యోగికీ స్ఫూర్తినిస్తుందని వ్యాఖ్యానించారు.