ఎలాన్ మస్క్ చేతికి ట్విట్టర్?: ఆ ఆఫర్ను పునఃసమీక్షిస్తోన్న సోషల్ మీడియా దిగ్గజం
వాషింగ్టన్: ప్రైవేట్ అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్ఎక్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ తయారీ కంపెనీ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చేసిన తాజా ప్రతిపాదన.. మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్లో కలకలం రేపుతోంది. దీన్ని టేకోవర్ చేయడానికి ఎలాన్ మస్క్ ఆఫర్ ఇచ్చిన అనంతరం పలు కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. ఈ ప్రతిపాదనలపై సమగ్రమైన అధ్యయనం చేయడానికి, అంచనాలను రూపొందించడానికి ట్విట్టర్ యాజమాన్యం.. అమెరికన్ కంపెనీని ఆశ్రయించింది. జేపీ మోర్గాన్ అండ్ కో సహకారాన్ని తీసుకుంది.
ఆఫర్పై పునఃసమీక్ష..
దీని తరువాత ట్విట్టర్ మరో కీలక నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలు లేకపోలేదు. ట్విట్టర్ను టేకోవర్ చేయడానికి ఎలాన్ మస్క్ ఇచ్చిన ప్రతిపాదనలను పునఃసమీక్షిస్తోంది. దీనిపై ఓ సానుకూల నిర్ణయాన్ని తీసుకోవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. తమకు ఏ మాత్రం వర్కవుట్ అయ్యే పరిస్థితులు ఉన్నా.. ఎలాన్ మస్క్ ఇచ్చిన ఆఫర్ను అంగీకరించే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. దీనిపై ది వాల్స్ట్రీట్ జర్నల్ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
46.5 బిలియన్ డాలర్లతో..
ఈ టాప్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ను కొనుగోలు చేయడానికి ఎలాన్ మస్క్- 46.5 బిలియన్ డాలర్లతో కూడిన ఆఫర్ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనలు అందిన తరువాత ట్విట్టర్లో తీవ్ర కలకలం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ బిగ్ డీల్ను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ట్విట్టర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పాయిజన్ పిల్ విధానాన్ని అనుసరించింది. ఈ విధానం వల్ల కంపెనీ కొనుగోలు వ్యవహారం మరింత క్లిష్టతరమౌతుందని, వేల్యుయేషన్ భారీగా పెరగడం వల్ల ఎలాన్ మస్క్ వెనక్కి తగ్గుతాడనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుంది.
మరింత స్వేచ్ఛగా..
ప్రస్తుతం ట్విట్టర్లో ఎలాన్ మస్క్కు 9.2 శాతం మేర వాటాలు ఉన్నాయి. కాగా- ఎలాన్ మస్క్ గత శుక్రవారం కొందరు ట్విట్టర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ను ప్రైవేట్గా కలుసుకున్నారని వాల్స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొంది. ట్విట్టర్ను కొనుగోలు చేయడానికి చేస్తోన్న ప్రయత్నాలు సఫలమైనా, కాకపోయినా ఈ మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ను భావ ప్రకటనా స్వేచ్ఛకు అనుగుణంగా మార్చాలని మస్క్ నిర్ణయం తీసుకున్నాడని పేర్కొంది.
జేపీ మోర్గాన్తో స్టడీ
ఇందులో భాగంగా ఆయన పలువురు షేర్ హోల్డర్లతో వీడియో కాల్స్ ద్వారా సంభాషించాడని ఈ కథనం స్పష్టం చేసింది. తమ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో చేరాలంటూ ఇదివరకు ట్విట్టర్ యాజమాన్యం ఎలాన్ మస్క్ను ఆహ్వానించింది. ఆయన దీన్ని తిరస్కరించారు. ఆ తరువాతే దీన్ని టేకోవర్ చేయాలనే ప్రతిపాదనలను తెరమీదికి తెరమీదికి వచ్చాయి.
ఎలాన్ మస్క్ ఇచ్చిన ఆఫర్ను అధ్యయనం చేయడానికి ట్విట్టర్ యాజమాన్యం.. జేపీ మోర్గాన్ సహాయాన్ని తీసుకుంది. కంపెనీ లాభనష్టాలను జేపీ మోర్గాన్ ద్వారా బేరీజు వేసింది. జేపీ మోర్గాన్తో అధ్యయనం చేయించిన తరువాతే- ఈ పునఃసమీక్ష నిర్ణయాన్ని తీసుకుంది ట్విట్టర్.