గుండె బద్దలయ్యే వేదన ఇది!: చైనాలో చిన్నారుల దుస్థితి.. 'బస్సు కింద కూర్చొని'!
ఇలా తల్లిదండ్రులకు దూరంగా పెరుగుతున్న పిల్లల్లో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.. మానసిక రోగులుగా తయారవుతున్నవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది.
బీజింగ్: బతుకుదెరువు కోసం పట్టణాలకు వలస వెళ్లేవారి సంఖ్య చైనాలో అత్యంత ఎక్కువ. తీరా పట్టణాలకు వెళ్లాక అక్కడి ప్రమాణాలకు అనుగుణంగా బతకడానికి వారు సంపాదించే డబ్బు కూడా సరిపోదు.
పట్టణాలకు వలస వెళ్లే క్రమంలో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంటివద్దే వదిలేసి వెళ్తుంటారు. అలా చైనాలో అమ్మమ్మలు, నానమ్మల వద్ద పెరుగుతున్న పిల్లలే ఎక్కువ. దాదాపు 20లక్షల మంది పిల్లలు ఎవరికి వారే ఒంటరిగా బతుకుతున్నట్లు కూడా రిపోర్టులు చెబుతున్నాయి.

తాజా ఘటన ఇలా:
రెండు రోజుల క్రితం ఇద్దరు పిల్లలు ఒక బస్సు కింద కూర్చొని ప్రయాణించిన ఘటనతో చైనాలో వలసల విషయం మరోసారి చర్చనీయాంశమైంది. వేరే పట్టణంలో పనిచేస్తున్న తమ తల్లిదండ్రులను చూడటానికి ఇద్దరు చిన్నారులు.. ఏకంగా బస్సు చక్రాల పక్కన ఉన్న కొద్దిపాటి ఖాళీ స్థలంలో ఇరుక్కుపోయి ప్రయాణించారు. దక్షిణ గువాంగ్సి ప్రావిన్స్ సమీపంలో ఈ ఘటన వెలుగుచూసింది.

చిన్నారుల ఆరాటం.., గుండె బద్దలైంది :
దాదాపు 5కి.మీ దూరం వరకు ఈ చిన్నారులిద్దరు అత్యంత ప్రమాదకరమైన రీతిలో అలా బస్సు కిందే ప్రయాణించారు. ఈ మార్గంలో లోయలు, వంపులు కూడా ఎక్కువే. వాటిని తట్టుకుని మరీ వారిద్దరు బస్సు కింద ప్రయాణించడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. తల్లిదండ్రులను చూడటం కోసం వారు ఆరాటపడుతున్న తీరు గుండె బద్దలయ్యేలా చేసింది. కొన్ని కి.మీ వెళ్లిన తర్వాత ఒక చెక్ పాయింట్ వద్ద అధికారులు ఈ చిన్నారులను గుర్తించి బయటకు తీసుకొచ్చారు. అలా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

మిస్సింగ్ కేసు:
చిన్నారుల తల్లిదండ్రులు వేరే పట్టణంలో ఉంటుండటంతో వాళ్లను చూడాలన్న కోరిక రోజురోజుకు ఎక్కువైంది. దీంతో నానమ్మకు చెప్పకుండా ఇంట్లో నుంచి బయలుదేరారు. చిన్నారులు స్కూల్ కు రాకపోవడంతో వారి టీచర్ కూడా నవంబర్ 23న మిస్సింగ్ కేసు నమోదు చేయించింది. చివరికి అధికారులు వీరిని గుర్తించడంతో బంధువులు వచ్చి తీసుకెళ్లారు. ఇద్దరు పిల్లలు చాలా సన్నగా, పాలిపోయినట్లుగా ఉన్నారు.

చైనాలో ఇదీ పరిస్థితి:
చైనాలో దాదాపు 61లక్షల మంది పిల్లలు తల్లిదండ్రుల నుంచి వేరుగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. బతుకుదెరువు కోసం తల్లిదండ్రులు వేరే ప్రాంతాలకు వలస వెళ్తుండటంతో వారికీ దుస్థితి తలెత్తింది. 33శాతం మంది చిన్నారులు తమ నానమ్మలు, అమ్మమ్మల వద్దే పెరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. 3శాతం మంది.. అంటే, 20లక్షల మంది చిన్నారులు ఎవరి ఆలనా పాలనా లేకుండా స్వతంత్రంగా పెరుగుతున్నట్లు గతంలోనే వెల్లడైంది.

ఆత్మహత్యలు.. మానసిక వ్యాధులు:
ఇలా తల్లిదండ్రులకు దూరంగా పెరుగుతున్న పిల్లల్లో ఆత్మహత్యలకు పాల్పడుతున్నవారు.. మానసిక రోగులుగా తయారవుతున్నవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. చాలామంది పిల్లలు తమ తల్లిదండ్రులను సంవత్సరానికి ఒకసారి చూడటం కూడా గగనమైపోయింది. ఒకే బిడ్డ పాలసీని ప్రభుత్వం రద్దు చేసి.. ఇద్దరు బిడ్డలకు అనుమతినివ్వడంతో.. భవిష్యత్తులో వలసల కారణంగా ఒంటరిగా మిగిలిపోయే చిన్నారుల సంఖ్య మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications