మనుషుల నుంచి జంతువులకు సంక్రమించిన వైరస్: జూ పార్క్లో కలకలం..అప్రమత్తం: తొలిసారిగా
వాషింగ్టన్: ఇప్పటిదాకా ఎలాంటి వైరస్ వ్యాప్తి చెందినా అది జంతువుల నుంచో లేక పక్షుల నుంచో మనుషులకు సంక్రమిస్తుండేవి. ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. తాజాగా మనుషుల నుంచి జంతువులకు వైరస్ సంక్రమించింది. రెండు గొరిల్లాలు వైరస్ బారిన పడ్డాయి. తీవ్ర అనారోగ్యానికి గురయ్యాయి. ఓ జులాజికల్ పార్క్లో ఈ ఘటన చోటు చేసుకోవడం కలకలం రేపింది. కొత్త అనుమానాలకు తెర తీసినట్టయింది. ఆ రెండు గొరిల్లాల నుంచి మిగిలిన జంతువులకు కూడా వైరస్ సోకే ప్రమాదం లేకపోలేదనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి.
అమెరికా కాలిఫోర్నియాలోని శాన్డియాగో జూపార్క్లో ఈ ఘటన చోటు చేసుకుంది. రెండు గొరిల్లాలు కరోనా వైరస్ బారిన పడ్డాయి. వారం రోజులుగా దగ్గుతో బాధపడుతుండటంతో జూపార్క్ అధికారులు వాటికి పరీక్షలను నిర్వహించగా.. కరోనా వైరస్ పాజిటివ్గా తేలింది. గొరిల్లాలకు కరోనా వైరస్ ఎలా సోకిందనే విషయంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా దిగ్భ్రాంతికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. గొరిల్లాలను సంరక్షించే సిబ్బంది ద్వారా వాటికి కరోనా సోకినట్లు తేలింది. వాటికి ఆహారాన్ని అందించే ఇద్దరు సిబ్బంది నుంచి వాటికి వైరస్ సంక్రమించినట్లు నిర్ధారంచారు.
ఆ ఇద్దరిలోనూ కరోనా వైరస్ లక్షణాలు కనిపించట్లేదని, అందుకే వారు ఎప్పట్లాగే విధులకు హాజరయ్యారని, గొరిల్లాల సంరక్షణలో ఉన్నారని తెలిపారు. ఈ నెల 6వ తేదీ నుంచి ఆ రెండు గొరిల్లాలు తీవ్రంగా దగ్గుతుండటాన్ని జూ అధికారులు గుర్తించారు. అదే రోజు వాటికి కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించారు. శాంపిళ్లను సేకరించి యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ నేషనల్ వెటరినరీ సర్వీస్ ల్యాబొరేటరీకి పంపించారు. శుక్రవారం ఈ నివేదిక అధికారుల చేతికి అందింది. వాటికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారించామని శాన్డియాగో గవర్నర్ గవిన్ న్యూసొమ్ తెలిపారు.
Recommended Video
వైరస్ బారిన పడిన గొరిల్లాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, వాటిని వేరుగా ఉంచి వైద్య చికిత్సను అందిస్తున్నామని శాన్డియాగో జూ సఫారి పార్క్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లిసా పీటర్సన్ తెలిపారు. ఈ రెండు ఆరోగ్యంతో ఉన్నాయని, రోజూలాగే ఆహారాన్ని తీసుకుంటున్నాయని పేర్కొన్నారు. కాలిఫోర్నియాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల తీవ్రత అత్యధికంగా ఉంటోంది. కాలిఫోర్నియా స్టేట్లో 30,386 మంది కరోనా బారిన పడి మరణించారు. 27,58,909 కేసులు అక్కడ నమోదు అయ్యాయి. తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కిందటి నెలలో జూపార్క్ను మూసివేశారు.