అధ్యక్ష ఎన్నికల వేళ... కిడ్నాప్ కుట్ర కలకలం... అరెస్టయినవారిలో ఇద్దరు నేవీ అధికారులు...
అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ 'మిచిగాన్ గవర్నర్ కిడ్నాప్ కుట్ర' వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. తన కిడ్నాప్కు ప్లాన్ చేసినవారు రైట్ వింగ్ శక్తులేనని గవర్నర్,డెమోక్రాటిక్ పార్టీ నేత గ్రెచెన్ విట్మర్ ఆరోపిస్తున్నారు. ఈ కుట్రను భగ్నం చేసిన ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్(FBI) అధికారులు ఇప్పటికే 13 మంది అనుమానితులను అరెస్ట్ చేసింది. వీళ్లలో ఇద్దరు నేవీ మాజీ అధికారులు ఉన్నట్లు వెల్లడవడం ఇప్పుడు కలకలం రేపుతోంది.
గతంలో మెరైన్ కార్ప్స్గా పనిచేసిన జోసెఫ్ మారిసన్(26),డానియెల్ హారిస్లు అరెస్టయినవారిలో ఉన్నట్లు తేలింది. మిలటరీ రికార్డులు కూడా వీరిద్దరు గతంలో నేవీలో పనిచేసినట్లు ధ్రువీకరిస్తున్నాయి. దీనిపై ఓ మెరైన్ కార్ప్స్ అధికారి మాట్లాడుతూ.. ఆ ఇద్దరి అరెస్టు గురించి తమకు తెలుసన్నారు. ప్రస్తుతం వారిపై ఎలాంటి అభియోగాలు మోపారో కూడా తమకు తెలుసునని... ఒకవేళ ఎఫ్బీఐ అధికారులు విచారణ నిమిత్తం తమ డిపార్ట్మెంట్ను సంప్రదిస్తే అందుకు సహకరిస్తామన్నారు.
జోసెఫ్ మారిసన్(26) 2014 నుంచి 2019 వరకు రైఫిల్మ్యాన్గా పనిచేశాడని... 2019లో కార్పోరల్ E-4 హోదా పొందినట్లు చెబుతున్నారు. గత వారమే అతను ఉద్యోగాన్ని వదిలిపెట్టాడని... తన చివరి అసైన్మెంట్ మిచిగాన్లోని బాటిల్ గ్రీక్ నాలుగో మెరైన్ లాజిస్టిక్స్ గ్రూప్లో పూర్తి చేశాడని చెబుతున్నారు.
ఎఫ్బీఐ అరెస్ట్ చేసినవారిలో మారిసన్తో పాటు ఆడమ్ ఫాక్స్(37),గార్బిన్(24),కలెబ్ ఫ్రాంక్స్(26),బ్రాండన్ క్యాసర్టా(32),పౌల్ బెల్లార్(21),షాన్ ఫిక్స్(38),ఎరిక్ మోలిటర్(36),మైకెల్ నల్(38),విలియమ్ నల్(38),పీట్ మ్యూజికో(42) ఉన్నారు.
కిడ్నాప్ కుట్రపై మిచిగాన్ గవర్నర్ గ్రెచెన్ విట్మర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ దేశీ ఉగ్రవాదులు రిపబ్లిక్ పార్టీ నాయకత్వ మద్దతుతోనే ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.