కొరియా ద్వీపకల్పంపై మళ్లీ అమెరికా యుద్ధవిమానాల చక్కర్లు
అణుదాడి చేస్తామంటూ వరుస హెచ్చరికలకు దిగుతున్న ఉత్తరకొరియాకు దీటుగా బదులిచ్చేందుకు అమెరికా కూడా సమాయత్తమవుతోంది.
సియోల్: అగ్రరాజ్యం అమెరికా, ఉత్తరకొరియా మధ్య గత కొంతకాలంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అణుదాడి చేస్తామంటూ వరుస హెచ్చరికలకు దిగుతున్న ఉత్తరకొరియాకు దీటుగా బదులిచ్చేందుకు అమెరికా కూడా సమాయత్తమవుతోంది.
ఇందులో భాగంగానే ఉత్తరకొరియా నుంచి వచ్చే ముప్పుపై ఎలా స్పందించాలనే అంశంపై రక్షణశాఖ అధికారులతో ట్రంప్ మంగళవారం సమావేశమయ్యారు. ఇదే సమయంలో కొరియా ద్వీపకల్పంపై అమెరికా యుద్ధవిమానాలు చక్కర్లు కొట్టడం గమనార్హం.

అమెరికాకు చెందిన రెండు విమానాలతో పాటు దక్షిణకొరియా మిలిటరీకి చెందిన రెండు ఫైటర్ జెట్లు కొరియా ద్వీపకల్పంపై చక్కర్లు కొట్టాయి. అయితే అమెరికా, దక్షిణకొరియా సంయుక్తంగా డ్రిల్ చేపట్టిందని.. అందులో భాగంగానే యుద్ధ విమానాలు వెళ్లినట్లు దక్షిణకొరియా అధికారిక ప్రకటన వెలువరించింది.
మరోవైపు అమెరికా మిలిటరీ కూడా దీనిపై స్పందించింది. జపాన్కు చెందిన యుద్ధవిమానాలు కూడా ఈ డ్రిల్లో పాల్గొన్నట్లు పేర్కొంది. అమెరికా, జపాన్, దక్షిణకొరియా సంయుక్తంగా మిలిటరీ డ్రిల్ నిర్వహించడం ఇదే తొలిసారి.
ఇటీవల అమెరికాపై ఉత్తరకొరియా వరుస హెచ్చరికలు చేయడం, అమెరికా అధీనంలో ఉన్న గువామ్ ద్వీపంపై అణుదాడి చేస్తామని బెదిరింపులకు దిగడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తరకొరియా ఆగడాలను అరికట్టేందుకు అమెరికా కూడా చర్యలు చేపట్టింది. గువామ్ బేస్ నుంచే ఈ యుద్ధవిమానాల డ్రిల్ చేపట్టింది.












Click it and Unblock the Notifications