Interesting: ఓ భర్త..12 మంది భార్యలు..102 మంది పిల్లలు..ఇదీ స్టోరీ..!
కంపాలా: మహాభారతంలో ధృతరాష్ట్రుడికి వంద మంది సంతానం అని చదివాం. ఉగాండాలో ఉండే ఈ రైతుకు అంతకుమించిన సంఖ్యలో పిల్లలు ఉన్నారు. 102 మందిని కన్నాడీ ఘనుడు. ఆ 102 మందికి 568 మంది పిల్లలు. అతనికి ఉన్న భార్యలు డజను మంది. ఇలా ఓ మినీ విలేజ్ను సృష్టించాడు. ఆస్తిపాస్తులు ఉన్న వాడు కూడా కాదు.. ఓ సామాన్య రైతు. అతని వయస్సు ఇప్పుడు 67 సంవత్సరాలు.
వయస్సు సహకరించకపోవడంతో పిల్లల పోషణ భారమైంది. పిల్లలు పుట్టకుండా గర్భ నిరోధక మాత్రలను వాడాలంటూ తన 12 మంది భార్యలకు ఉచిత సలహా ఇచ్చాడతను. ఆ రైతు పేరు మూసా హసహ్య. ఉగాండాలోని బుగిసాలో నివసిస్తోన్నాడు. ఓ సాధారణ రైతు తన కుటుంబంతో కలిసి 12 బెడ్రూమ్ల ఇంట్లో నివసిస్తోన్నాడు.

1971లో పెళ్లి చేసుకున్నాడు. అప్పుడతని వయస్సు 16 సంవత్సరాలు. హనీఫా అనే యువతిని పెళ్లాడాడు మూసా. రెండేళ్ల తర్వాత మూసా హసహ్యా- హనీఫా దంపతులకు ఆడపిల్ల పుట్టింది. అప్పట్లో చేతుల్లో పెద్ద ఎత్తున డబ్బులు ఉండటంతో వరుసగా పెళ్లిళ్లు చేసుకున్నాడు. అలా 12 మందిని పెళ్లి చేసుకున్నాడు. 102 మంది పిల్లలను కన్నాడు. ఉగాండాలో బహు భార్యత్వానికి చట్టబద్ధత ఉంది. ఒకరి కంటే ఎక్కువమందిని పెళ్లి చేసుకోవచ్చు.
తన సంతానానికి- వారి పిల్లలు తోడు కావడంతో మొత్తం కుటుంబ సభ్యుల సంక్య 568కి పెరిగింది. దీనితో కుటుంబ పోషణ కష్టతరమైంది. ఆస్తిపాస్తులు, పొలాలను అమ్ముకోవాల్సి వచ్చింది. పిల్లలు వద్దనుకున్నాడు. తన భార్యలకు గర్భనిరోధక మాత్రలను వాడాలని సూచించాడు. తనకు ఉన్న ఆస్తులు కరిగిపోయాయని, కుటుంబ పోషణ భారం కావడం వల్ల ఇక పిల్లలను వద్దనుకున్నానని స్పష్టం చేశాడు మూసా హసహ్యా.

అందుకే గర్భధారణ వయస్సులో ఉన్న భార్యలందరికీ గర్భనిరోధక మాత్రలను వాడమని సలహా ఇచ్చానని పేర్కొన్నాడు. కుటుంబ పోషణ, పిల్లల భవిష్యత్ కోసం ప్రభుత్వం సహాయం చేయాలని కోరుకుంటోన్నాడు. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయని మూసా అతని చిన్న భార్య, జులైకా పేర్కొంది. ఆమె 11 మంది పిల్లల తల్లి. ఇక పిల్లలు వద్దనుకుని పిల్స్ వాడుతున్నానని తెలిపింది.












Click it and Unblock the Notifications