మాల్యాకు కలిసివస్తున్న అదృష్టం: ఇక వారానికి 18వేల పౌండ్లు!
లండన్: సుమారు 9వేల కోట్ల మేర బ్యాంకు రుణాలను ఎగ్గొట్టి లండన్ పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు ప్రతీసారి అదృష్టం కలిసివస్తున్నట్లుంది. ఇప్పటికే పలుమార్లు అరెస్ట్ వారెంట్లు జారీ అయినా.. ఆ వెంటనే అతనికి బెయిల్ కూడా మంజూరవడం తెలిసిందే.
తాజాగా, మాల్యా రోజూ వారి ఖర్చుల కోసం వారానికి 18వేల పౌండ్లు(రూ. సుమారు16లక్షలు) ఇవ్వాలని యూకే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఈ మొత్తం 5వేల పౌండ్లుగా ఉండేది. ఈ మొత్తాన్ని 20వేల పౌండ్లకు పెంచాలని మాల్యా తరపు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ వేశారు.
మాల్యాకు సంబంధించిన 1.5బిలియన్ డాలర్లు బ్యాంకుల్లో ఉండిపోయాయని.. రోజూవారీ ఖర్చులకు ఇబ్బందిగా మారిందని న్యాయవాదులు పిటిషన్లో తెలిపారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు బుధవారం తాజా ఆదేశాలు జారీ చేసింది.
భారత్లోని 17 బ్యాంకుల్లో సుమారు రూ. 9వేల కోట్లను ఎగ్గొట్టి 2016 మార్చిలో మాల్యా లండన్కు పారిపోయాడు. అయితే, ఈ కేసులో అతని బ్యాంకు ఖాతాలను నిలిపివేయాలని లండన్ కోర్టును భారత్ కోరింది. దీన్ని పరిగణలోకి తీసుకున్న కోర్టు.. మాల్యా ఖాతాలను నిలుపుదల చేసింది.
ఈ నేపథ్యంలోనే ఖర్చుల కోసం 5వేల పౌండ్లను ఇవ్వడానికి మొదట్లో అనుమతిచ్చింది. ఇప్పుడు ఆ డబ్బు సరిపోవడం లేదని విన్నవించడంతో 18వేల పౌండ్లకు పెంచింది కోర్టు.