మహిళా ఎంపీ దారుణహత్య: తుపాకీతో కాల్చి కత్తితో పొడిచి చంపాడు
లండన్: బ్రిటన్ యూరోపియన్ యూనియన్లోనే కొనసాగాలన్న విధానానికి గట్టి మద్దతు తెలిపిన ఎంపీ జో కాక్స్ (41)ను గుర్తు తెలియని వ్యక్తి పశ్చిమ యార్క్షైర్లో దారుణంగా హతమార్చాడు. ఆమెపై తొలుత కత్తితో దాడి చేసి, అనంతరం కిరాతకంగా మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు.
దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. లేబర్ పార్టీ తరుపున వెస్ట్ యార్క్షైర్ లోని బ్యాట్లీ అండ్ స్పెన్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. బ్రిటన్ యూరోపియన్ యూనియన్ (ఈయూ)లోనే కొనసాగాలన్న వాదానికి గత కొంతకాలంగా గట్టిగా మద్దతు తెలుపుతున్నారు.
ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నాం తన నియోజకవర్గంలోని బిర్స్టాల్ పట్టణంలో క్యాంపెయిన్ కోసం వచ్చారు. ఆమె రాకకోసం ఆమె కార్యాలయం వద్ద మాటువేసి ఉన్న దుండగుడు జో కాక్స్ రాగానే ఆమెపై మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. అనంతరం ఆమెను కత్తితో కిరాతకంగా పొడిచి చంపాడు.
మూడు రౌండ్లు కాల్పుల్లో ఒక బుల్లెట్ ఆమె తలలోకి దూసుకెళ్లడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను విమానంలో లీడ్స్ జనరల్ ఆసుపత్రికి తరలించినప్పటికీ లాభం లేకపోయింది. ఈ సంఘటనతో ఈయూ రిఫరెండం క్యాంపెయిన్ నిలిచిపోయింది.
కాగా 41 ఏళ్ల జో కాక్స్కు ఇద్దరు పిల్లలు. ఈ ఘటనకు సంబంధించి 52 ఏళ్ల టోమీ మయర్ను అరెస్టు చేసినట్లు వెస్ట్ యార్క్షైర్ పోలీసు వెస్ట్ యార్క్షైర్ పోలీసు విభాగం యాక్టింగ్ చీఫ్ కానిస్టేబుల్ డీ కాలిన్స్ తెలిపారు. ఈ ఘటనకు అంతర్జాతీయ ఉగ్రవాదానికి ఎటువంటి సంబంధం లేదని పోలీసులు తేల్చిచెప్పారు.
కాగా, మయర్ గార్డెనింగ్ జాబ్ చేసుకుంటూ జీవనం సాగించేవాడని స్థానికులు తెలిపారు. 1990లో జరిగిన శాంతి ఒప్పందం తర్వాత నార్తర్న్ ఐర్లాండ్లో బ్రిటిష్ రాజకీయనేతలపై కాల్పులకు తెగబడిన సంఘటన ఇదే కావడం విశేషం. ఈ సంఘనటో బ్రిటిష్ పాలకులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.