బ్రిటన్ ప్రధాని ఇంట్లో భజనలు- భక్తి గీతాలు
లండన్: ఏపీ, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా దీపావళి పండగ ఆనందోత్సాహాల మధ్య సాగింది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండగను జరుపుకొంటారు. చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోంది.
నేడు బలి పాఢ్యమి. ప్రతి సంవత్సరం దీపావళి నాటి మరుసటిరోజును బలి పాడ్యమిగా జరుపుకొంటారు. కార్తీకమాసం ప్రారంభం అయ్యేది కూడా అప్పుడే. పాడ్యమి- బలిచక్రవర్తికి ప్రీతికరమైన రోజుగా భావిస్తారు. చాలా రాష్ట్రాల్లో బలిచక్రవర్తిని పూజిస్తారు. కేరళ, మహారాష్ట్ర, బిహార్ వంటి పలు రాష్ట్రాల్లో బలిపాడ్యమికి అత్యంత ప్రాధాన్యత ఉంది.

దీపావళి వేడుకలు ఈ సారి అమెరికా, బ్రిటన్ వంటి అగ్రదేశాల్లో వైభవోపేతంగా సాగాయి. న్యూయార్క్లోని ప్రఖ్యాత ఎంపైర్ బిల్డింగ్ను ఆరెంజ్ రంగుతో అలంకరించారు. ప్రవాస భారతీయులు నిర్వహించిన దీపావళి వేడుకలకు న్యూయార్క్ మేయర్ హాజరయ్యారు. రాజధాని వాషింగ్టన్ డీసీలో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ హిందూ సంప్రదాయంలో దీపావళి వేడుకలను జరుపుకొన్నారు.
బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ అధికారిక నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్లో కన్నులపండువగా దీపావళి వేడుకలు జరిగాయి. దీపావళిని పురస్కరించుకుని తన నివాసంలో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. దీనికి విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ హాజరయ్యారు.

భజనలు, భక్తి గీతాలతో 10 డౌనింగ్ స్ట్రీట్.. మారుమోగిపోయింది. రిషి సునాక్, ఆయన భార్య, అక్షత మూర్తి, కుమార్తెలు కృష్ణ సునాక్, అనౌష్క సునాక్తో కలిసి ఇందులో పాల్గొన్నారు. నేలపై కూర్చుని భక్తి గీతాలను ఆలపించారు. లండన్లో స్థిరపడిన పలువురు ప్రవాస భారతీయులు ఈ వేడుకలకు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications