30 ఏళ్ల లోపు వారికి ఆస్ట్రాజెనెకా వద్దు... ప్రత్యామ్నాయ వ్యాక్సిన్ ఇవ్వండి... : యూకె ప్రభుత్వ కమిటీ
ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ది చేసిన కరోనా వ్యాక్సిన్ సమర్థతపై యూకెలో చాలా అనుమానాలు తలెత్తుతున్నాయి. వ్యాక్సిన్ తీసుకున్నవారిలో ఇప్పటివరకూ 19 మంది మెదడులో రక్తం గడ్డ కట్టి చనిపోయారు. వీరంతా 18-79ఏళ్ల లోపువారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ ఇలా రక్తం గడ్డ కట్టిన కేసులు 79 వెలుగుచూశాయి. ఈ నేపథ్యంలో యూకె ప్రభుత్వానికి చెందిన కమిటీ ఒకటి కరోనా వ్యాక్సినేషన్పై కీలక సూచన చేసింది. 30 ఏళ్ల లోపు వాళ్లందరికీ ఆస్ట్రాజెనెకాకు బదులు ప్రత్యామ్నాయ వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించింది.
'18 నుంచి 29 ఏళ్ల వయసులో ఉండి... ఇప్పటివరకూ ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనివారందరికీ... ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్కు బదులు ప్రత్యామ్నాయ వ్యాక్సిన్ అందించాలి.' అని వ్యాక్సినేషన్&ఇమ్యూనైజేషన్పై యూకె ప్రభుత్వం నియమించిన వెయిన్ షెన్ లిమ్ జాయింట్ కమిటీ వెల్లడించింది.
యూకెలో ఇటీవలి కాలంలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తీసుకున్న 19 మంది రక్తం గడ్డ కట్టి చనిపోయారు. దీంతో వ్యాక్సిన్కు,రక్తం గడ్డ కట్టడానికి ఉన్న లింకును విశ్లేషిస్తున్నట్లు నిపుణులు వెల్లడించారు. ఈ సమాచారాన్ని విశ్లేషించేవరకూ చిన్నారులపై టీకా ట్రయల్స్ను నిలిపివేస్తున్నట్లు ఇదివరకే ప్రకటించారు.
నిజానికి ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్పై మొదట్లో వచ్చిన ఆరోపణలను యూకె ప్రభుత్వం తోసిపుచ్చింది. కానీ వ్యాక్సిన్ కారణంగా రక్తం గడ్డ కట్టి చనిపోతున్నవారి సంఖ్య పెరుగుతుండటంతో... ఆ విషయాన్ని ధ్రువీకరించక తప్పలేదు. ఈ నేపథ్యంలో చాలా దేశాలు ఆస్ట్రాజెనెకా పంపిణీపై ఇప్పుడు ఆచి తూచీ నిర్ణయం తీసుకుంటున్నాయి. ఐర్లాండ్,డెన్మార్క్,నార్వే,ఐస్లాండ్,ఆస్ట్రియా,నెదర్లాండ్స్ తదితర దేశాలు ఇప్పటికే ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ పంపిణీ నిలిపివేశాయి. భారత్ మాత్రం ఆ వ్యాక్సిన్ను కొనసాగిస్తామని స్పష్టం చేసింది.
Recommended Video
భారత్లో పుణేలోని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కోవీషీల్డ్ వ్యాక్సిన్ను ఉత్పత్తి చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నెలకు 6 నుంచి ఆరున్నర కోట్ల వ్యాక్సిన్ డోసులను ఉత్పత్తి చేస్తున్నట్లు ఆ కంపెనీ సీఈవో అదర్ పూనావాలా మంగళవారం(ఏప్రిల్ 6) వెల్లడించారు. ఇప్పటివరకూ భారత్కు 10 కోట్ల డోసులు,మరో 6 కోట్ల యూనిట్లను విదేశాలకు ఎగుమతి చేశామని అదర్ చెప్పారు. అయినప్పటికీ, దేశంలో వ్యాక్సిన్ అవసరమయ్యే ప్రతి ఒక్కరికీ అందించేందుకు ఎంతో దూరంలో ఉన్నామని ఆయన అన్నారు.వ్యాక్సిన్ ఉత్పత్తి విషయంలో తమపై చాలా ఒత్తిడి ఉందన్నారు.