భారత్ సహా విదేశీయులకు షాకిస్తూ బ్రిటన్ నిర్ణయం: వీసా ఫీజు పెంపు, ఎప్పట్నుంచంటే?
హైదరాబాద్: భారతీయులతోపాటు విదేశీయులకు షాకిస్తూ బ్రిటన్ కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీయులకు తమ దేశ వీసా ఫీజుల పెంపు అక్టోబర్ 4 నుంచి అమల్లోకి వస్తుందని బ్రిటన్ తాజాగా ప్రకటించింది. దీంతో ఆరు నెలలు, అంతకంటే తక్కువ వ్యవధిగల పర్యాటక వీసాలపై ఇక నుంచి 15 జీబీపీ (బ్రిటీష్ పౌండ్ స్టెర్లింగ్)లు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.
అలాగే, విద్యార్థి వీసాల ఫీజు అదనంగా 127 జీబీపీలు పెరుగుతున్నట్లు వెల్లడించింది. దీనికి ఇంకా పార్లమెంట్ ఆమోదం లభించాల్సి ఉంది. అయితే, ఈ ప్రక్రియ లాంఛనమే కానుంది. వీసాల ఫీజు పెంపుతో భారత్ సహా ప్రపంచ దేశాల పౌరులకు ఇకపై బ్రిటన్ వెళ్లడం మరింత భారంగా మారనుంది.

స్టూడెంట్ వీసా దరఖాస్తు ఫీజును 490 పౌండ్ల వరకు వసూల్ చేయనున్నట్లు యూకే హోం ఆఫీసు వెల్లడించింది. పర్యాటకులకు ఇచ్చే విజిట్ వీసా ఫీజును కూడా పెంచేశారు. విజిట్ వీసాపై 15 పౌండ్లు పెంచారు. దీంతో ఇప్పుడు ఆ వీసా ఖరీదు 115 పౌండ్లు అయ్యింది. ఇది కేవలం ఆర్నెళ్ల విజిట్ వీసాకు మాత్రమే.
అక్టోబర్ నాలుగో తేదీ నుంచి కొత్త ఫీజులు అమలులోకి రానున్నట్లు యూకే ఇమ్మిగ్రేషన్ శాఖ తెలిపింది. 2021-2022 సీజన్లో భారత్ నుంచి సుమారు లక్షా 20 వేల మంది చదువు కోసం బ్రిటన్ వెళ్లారు. ఆ దేశంలో విద్యను అభ్యసిస్తున్న విదేశీయుల్లో ఇండియన్ల సంఖ్యే ఎక్కువ. కీలకమైన సేవల్ని అందించేందుకు ఉద్దేశంతో ఫీజును పెంచినట్లు ప్రభుత్వం పేర్కొంది. పెంచిన ఫీజులతో ప్రాధాన్యత రంగాలకు నిధులను కూడా పెంచవచ్చు అని ప్రభుత్వం అభిప్రాయపడింది.
ఉపాధ్యాయులు, పోలీసులు, జూనియర్ డాక్టర్లు, ఇతర ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులకు 5 శాతం నుంచి 7 శాతం వరకు వేతనాలను పెంచాలని స్వతంత్ర రివ్యూ కమిటీ సిఫార్సులకు తలొగ్గిన ప్రధాని రిషి సునాక్ ఆ భారాన్ని విదేశీయులపై వేయాలని నిర్ణయించడం గమనార్హం.
ప్రజల నుంచి పన్నుల రూపంలో వచ్చే డబ్బును వేతనాలకు ఖర్చు చేయడం తనకు ఇష్టం లేదని, అందుకే వీసా ఫీజులను, ఇమ్మిగ్రేషన్ హెల్త్ సర్ ఛార్జీని పెంచాలని నిర్ణయించామని యూకే ప్రధాని సునాక్ స్పష్టం చేశారు. తాజా పెంపుతో బ్రిటన్ ఖజానాకు బిలియన్ జీబీపీల ఆదాయం సమకూరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కాగా, బ్రిటన్ దేశాలకు వీసా పెంపులో కొంత తగ్గింపును ప్రకటించింది.












Click it and Unblock the Notifications