మా కష్టాల్ని క్యాష్ చేసుకుంటారా ?.. ఇది అనైతికం ! భారత్ పై ఉక్రెయిన్ మంత్రి ఆవేదన !
ఉక్రెయిన్ పై రష్యా దండెత్తి ఎనిమిది నెలలు దాటిపోయింది. అయినా ఇప్పటికీ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్దితి. మరోవైపు ఈ యుద్ధం కారణంగా తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్న రష్యా డిస్కౌంట్ పేరుతో భారత్ కు తక్కువ ధరకు చమురు అమ్ముతోంది. దీంతో భారత్ భారీగా లబ్ది పొందుతోంది. ఈ వ్యవహారంపై అమెరికా సహా పాశ్చాత్య దేశాలు ఇప్పటికే విమర్శలు గుప్పిస్తుండగా.. ఇప్పుడు ఉక్రెయిన్ సైతం భారత్ ను టార్గెట్ చేస్తోంది.
రష్యాతో తాము సాగిస్తున్న యుద్ధం ద్వారా భారత్ లబ్ది పొందుతోంది. ఇది పూర్తిగా అనైతికమని ఉక్రెయిన్ విదేశాంగమంత్రి దిమిత్రో కులేబా విమర్శించారు. జాతీయ మీడియా ఛానల్ ఎన్టీటీవీతో మాట్లాడిన ఆయన.. ఉక్రెయిన్ పై రష్యా దండయాత్రతో రోజూ తమ దేశ ప్రజలు చనిపోతున్నారని, కానీ తక్కువ ధరకు రష్యా నుంచి చమురు కొనడం ద్వారా భారత్ భారీగా లబ్ది పొందుతోందని కులేబా ఆరోపించారు. మా కష్టాల నుంచి మీరు ఇంత లబ్ది పొందుతున్నప్పుడు మాకు కూడా ఆ మేరకు సాయం చేయాలని ఆయన భారత్ కు సూచించారు.
ఈ ఏడాది ఫిబ్రవరి-నవంబర్ నెలల మధ్య యూరోపియన్ యూనియన్ .. రష్యా నుంచి 10 దేశాల కంటే ఎక్కువ శిలాజ ఇంధనాన్ని దిగుమతి చేసుకున్నట్లు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ నిన్న చేసిన ప్రకటనపై ఉక్రెయిన్ విదేశాంగమంత్రి కులేబా స్పందించారు. యూరోపియన్ యూనియన్ కూడా అదే పని చేస్తోందని భారత్ తో పోల్చారు. చౌకైన రష్యన్ చమురును దిగుమతి చేసుకోవాలనే భారత నిర్ణయాన్ని ఉక్రెయిన్లోని జనం బాధల కోణంలో చూడాలన్నారు. యుద్ధాన్ని ముగించడంలో సహాయం చేయడంలో భారతదేశం, ప్రత్యేకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీలక పాత్ర పోషించాలని ఆయన కోరారు.