ఐరాసలో కీలక తీర్మానం-భారత్ మద్దతు కోరిన ఉక్రెయిన్- రష్యాను కాదని...
గతేడాది తమపై మొదలుపెట్టిన యుద్దాన్ని ముగించకుండా కొనసాగిస్తున్న రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ఐరాసలో మరో తీర్మానం ప్రవేశపెట్టేందుకు ఉక్రెయిన్ సిద్ధమైంది.
ఉక్రెయిన్ పై గతేడాది మొదలుపెట్టిన దండయాత్రను రష్యా నిరాటంకంగా కొనసాగిస్తోంది. అయితే పాశ్చాత్య దేశాల మధ్దతుతో దీన్ని దీటుగా ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ సాధ్యమైనంత త్వరగా యుద్ధం ముగించాలని కోరుకుంటోంది. కానీ అది సాధ్యం కావడం లేదు. దీంతో రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ఐరాసలో మరో శాంతి తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతోంది.
ఐరాసలో తాము ప్రవేశపెట్టే శాంతి తీర్మానానికి మద్దతివ్వాల్సిందిగా భారత్ ను ఉక్రెయిన్ కోరింది. ఈ మేరకు ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ కు ఫోన్ చేసింది. తమ తీర్మానానికి భారత్ మద్దతివ్వాలని కోరింది. రష్యా నుంచి తాము శాంతిని తప్ప మరేమీ కోరుకోవడం లేదని ధోవల్ కు ఉక్రెయిన్ ప్రతినిధి తెలిపారు. రష్యా భూభాగం తమకు అక్కర్లేదని, తమ భూభాగం కోసమే పోరాడుతున్నట్లు ఆయన వెల్లడించారు.

మరోవైపు తమకు చిరకాల మిత్రదేశమైన రష్యాకు వ్యతిరేకంగా ఐరాసలో ప్రవేశపెట్టే తీర్మానాలకు మద్దతిచ్చే విషయంలో భారత్ తటస్ధంగా వ్యవహరిస్తోంది. అలాగని యుద్ధం ఆపేలా రష్యాపైనా తగిన ఒత్తిడి తీసుకురాలేకపోతోంది. ఈ నేపథ్యంలో ఈసారి అయినా ఉక్రెయిన్ ప్రవేశపెట్టే తీర్మానానికి భారత్ మద్దతిస్తుందన్న గ్యారంటీ లేదని తెలుస్తోంది. అయితే రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆగాలని కోరుకుంటున్నట్లు మాత్రమే భారత్ చెబుతోంది.












Click it and Unblock the Notifications