కశ్మీర్పై ఐక్యరాజ్యసమితి సంచలన వ్యాఖ్యలు : ఆ ఒప్పందం ప్రకారమే వెళ్లాలన్న యూఎన్
ఐక్యరాజ్య సమితి: కశ్మీర్ విషయంలో జోక్యం చేసుకోవాలని పాక్ ప్రధాని ప్రపంచదేశాలను కోరుతున్న సంగతి తెలిసిందే. కశ్మీర్ విషయంలో ఇప్పటికే ఐక్యరాజ్యసమితిని పాకిస్తాన్ ఆశ్రయించి ఫిర్యాదు కూడా చేసింది. దీనిపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరర్స్ స్పందించారు. రెండు దేశాలు శాంతి మంత్రం పాటించాలని గుటెరెర్స్ కోరారు. అంతేకాదు సిమ్లా ఒప్పందాన్ని కూడా ఈ సందర్భంగా తెరపైకి తీసుకొచ్చారు. కశ్మీర్ సమస్య ద్వైపాక్షిక సమస్య అని ఆయన గుర్తుచేశారు. జమ్మూ కశ్మీర్లోని ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలని ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోరాదని గుటెరర్స్ ఇరుదేశ ప్రభుత్వాలకు సూచించారు.
కర్ఫ్యూ ఎత్తేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా..?
ఇదిలా ఉంటే పాక్ ప్రధాని కశ్మీర్ విషయంలో ప్రపంచదేశాలు జోక్యం చేసుకోవాలని అన్నారు. కశ్మీర్లో మిలటరీ దళాలను మోహరించిన మోడీ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీచేయాలని కోరారు. గురువారం రోజున మోడీ ప్రసంగం తర్వాత ఇమ్రాన్ఖాన్ మాట్లాడారు. ఒక్కసారిగా కర్ఫ్యూ ఎత్తిసిన తర్వాత కశ్మీర్లో పరిస్థితి ఎలా ఉంటుందనేదానిపై ప్రపంచమంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తోందన్నారు ఇమ్రాన్ఖాన్. కశ్మీర్ లోయలో ప్రస్తుతం 46వేల ట్రూపుల బలగాలు మోహరించి ఉన్నాయి. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాయి.
జాగ్రత్త..కశ్మీర్ వివాదంలోకి అఫ్ఘానిస్తాన్ను లాగొద్దు: పాక్కు తాలిబన్ హెచ్చరిక
సిమ్లా ఒప్పందం ప్రకారం చర్చలు జరపాలి
ఇక ఐక్యరాజ్యసమతి ప్రధాన కార్యదర్శి స్పందనను ఆయన ప్రతినిధి స్టెఫనీ దుజారిక్ ప్రకటన ద్వారా విడుదల చేశారు. 1972 సిమ్లా ఒప్పందం ప్రకారం రెండు దేశాలు చర్చలు జరిపి ఒక పరిష్కారానికి రావాలని గుర్తుచేసినట్లు స్టెఫనీ తెలిపారు. అది కూడా ఐక్యరాజ్యసమితి నిబంధనల మేరకే జరగాలని సూచించినట్లు స్టెఫనీ తెలిపారు. అయితే కశ్మీర్ అంశంలో ఇతర దేశాల జోక్యం ఉండకూడదని గుటెరర్స్ స్పష్టం చేసినట్లు స్టెఫనీ చెప్పారు. కశ్మీర్ విషయంలో అంతర్జాతీయ దేశాల జోక్యం ఉండబోదని గుటెరర్స్ పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్కు సూచిస్తూనే భారత భూభాగంలో ఉన్న కశ్మీర్లో ఆంక్షల విధించడం సరికాదని సూచించారు. ఇలా చేయడమంటే అక్కడి ప్రజల హక్కులను హరించివేస్తున్నట్లుగానే భావించాల్సి ఉంటుందని అన్నారు.
ఆజాదీ కోసం పోరాటం ఆగదన్న పాక్ ప్రధాని
ప్రధాని మోడీ 38 నిమిషాల ప్రసంగాన్ని జాగ్రత్తగా ఫాలో అయిన పాక్ ప్రధాని వెంటనే స్పందించారు. ఎన్ని బలగాలు మోహరించిన కశ్మీర్ ప్రజలు ఆజాదీ కోసం చేసే పోరాటం ఆగదని పైగా ఎక్కువ అవుతుందని తెలిపారు. ఇప్పటి వరకు జమ్మూ కశ్మీర్పై ఎన్నో సార్లు యూఎన్ను పాకిస్తాన్ ఆశ్రయించింది. అయితే పీఓకే భూభాగం డిజైన్ కూడా మార్చి ఉల్లంఘనలకు పాల్పడింది. ఓవైపు సంయమనం పాటించాలని ఐక్యరాజ్యసమితి కోరుతుంటే ఇప్పటికే పాక్ ప్రభుత్వం వాటన్నిటినీ పక్కనబెడుతూ కఠిన నిర్ణయాలు తీసుకుంది.