తస్మాత్ జాగ్రత్త: తూర్పు ఆసియాకు అసమానతల ముప్పు
సింగపూర్: అటు విలాసవంతమైన బహుళ అంతస్తు భవనాలు.. ఇటు దీపం కిందనే నీడ ఉన్నట్లు వందల కొద్దీ విస్తరించి ఉన్న మురికివాడలు. సమాజంలో ఆర్థిక అసమానతలకు నిదర్శనమిది. కనీసం సౌకర్యాలు కాని.. మౌలిక వసతులు కాని లేని గూళ్లు. ఆర్థిక అసమానతలతో అసంతృప్తి క్రమంగా పెరిగిపోతున్నది.
ఏ సమాజానికైనా ఇదో పెద్ద జాడ్యం. దీనివల్ల సామాజిక అశాంతి చోటుచేసుకుంటుంది. ఇంకెన్నో సమస్యలకు ఇది కారణమవుతున్నది.ఆసియా దేశాలకు ఇటువంటి ముప్పే పొంచి ఉందని ప్రపంచ బ్యాంకు తన తాజా నివేదికలో స్పష్టం చేసింది.
ఆసియా దేశాల్లోని పట్టణ ప్రాంతాల్లో ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయని, దీనివల్ల తీవ్రమైన సమస్యలు తలెత్తకముందే ప్రభుత్వాలు దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా పట్టణ పేదలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నది.

తూర్పు ఆసియా దేశాల్లోని పట్టణ మురికివాడల్లో 25 కోట్ల మంది
ఆసియా దేశాల్లోని ప్రజల్లో సగంమంది పట్టణాల్లోనే నివసిస్తున్నారు. గత కొన్ని దశాబ్దాల్లో వేగవంతమైన పట్టణీకరణ చోటు చేసుకోవడంతో పట్టణ జనాభా పెరిగిపోయింది. దీంతో పేదరికం నుంచి బయటకు వచ్చేందుకు వారికి అవకాశం దక్కింది. పట్టణీకరణ వల్ల 65.5 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడినట్లు అంచనా. కానీ అదే సమయంలో ఆర్థిక అసమానతల ఫలితంగా పట్టణాల్లో మురికివాడలు పెరిగిపోయాయి. తూర్పు ఆసియా దేశాల్లో దాదాపు 25 కోట్లమంది ప్రజలు పట్టణ మురికివాడల్లో జీవించాల్సి వస్తోందని ప్రపంచ బ్యాంకు తన నివేదికలో వివరించింది. మురికివాడల్లో నివసిస్తున్న ప్రజల్లో అత్యధికులు చైనా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ దేశాల్లో ఉన్నారు. పేదరికం మీద నిర్వహించే సర్వేలన్నీ సాధారణంగా గ్రామీణ పేదలు- పట్టణ పేదల మధ్య వ్యత్యాసాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటాయి. కానీ పట్టణ ప్రజల మధ్య అంతరం పెరిగిపోతున్న సంగతి అంతగా పట్టించుకోవు. కానీ పట్టణ వాసుల్లో ఆర్థిక అసమానతలపై ప్రపంచ బ్యాంకు నివేదిక ఆసక్తికరంగా మారింది.

తూర్పు ఆసియాలో పెరుగుతున్న మురికివాడలు
తూర్పు ఆసియా దేశాల్లోని నగరాలు వేగవంతమైన పట్టణీకరణకు సిద్ధంగా లేవు. మౌలిక వసతుల కల్పన, ఉద్యోగాల సృష్టి, సేవల లభ్యత సమస్యాత్మకంగా ఉంది. దీనివల్ల నగరాల్లోని ప్రజల్లో అంతరాలు పెరిగిపోతున్నాయి. ధనికులు అత్యంత ధనికులుగా మారుతుండగా, పేదలకు ఎదిగే అవకాశమే లభించటం లేదు.ఇక ప్రపంచంలో వేగంగా పట్టణీకరణ చెందుతున్న ప్రాంతం తూర్పు ఆసియా. పసిఫిక్ దేశాలు కూడా ఇదే కోవలోకి వస్తాయి. ఈ దేశాల్లో పట్టణీకరణ రేటు ఎంతో అధికంగా మూడు శాతానికి చేరుకున్నది. 2018 నాటికి తూర్పు ఆసియా జనాభాలో సగంమంది పట్టణాల్లోనే ఉంటారు. ఈ జనాభా ప్రపంచ పట్టణ జనాభాలో మూడోవంతుతో సమానం. అందు వల్లే అక్కడ మురికి వాడలు పెరిగిపోతున్నాయి. 25 కోట్లమంది ప్రజలు కనీస వసతులు లేకుండా మురికివాడల్లో కాలం గడుపుతున్నారు.

మూడు డాలర్ల కంటే తక్కువ జీతంతో జీవనం
పట్టణ పేదలకు ఆర్థికంగా ఎదిగే అవకాశాలు కల్పించకపోతే, అది ఆ దేశ అభివద్ధిపై ప్రభావం చూపుతుంది. జపాన్, దక్షిణ కొరియా దేశాలు పట్టణ పేద ప్రజలకు తగిన అవకాశాలు కల్పించటంతో మెరుగైన ప్రగతి సాధించగలిగాయి. 1970, 1980 ప్రాంతంలో సింగపూర్ ఏటా 8 శాతం వృద్ధి సాధించింది. మౌలిక వసతుల అభివృద్ధి, అందుబాటులో గృహ వసతి, సాంఘిక సేవల విస్తృతి దీనికి కారణం. తూర్పు ఆసియా దేశాలకు ఇది ఆదర్శం కావాలి. ఆసియా దేశాల్లోని పట్టణ పేదల్లో అత్యధికంగా చైనా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్లో ఉన్నారు. ఈ దేశాల్లోని 7.5 కోట్ల మంది రోజుకు 3.10 డాలర్ల కంటే తక్కువ ఆదాయంతో బతుకులు వెళ్లదీస్తున్నారు. ఈ పేదలకు సరైన గృహ వసతి లేదు. ఉద్యోగాలు, ఉపాధి గగనకుసుమాలే. ఇండోనేషియా, ఫిలిప్పీన్స్లోని పట్టణ పేదల్లో దాదాపు 27 శాతంమందికి మరుగుదొడ్లు, స్నానపు గదులు కూడా సమస్యే. భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పుడు ఇటువంటి వారి కష్టాలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి.

సాంఘిక అశాంతి నెలకొంటుందని హెచ్చరిక
పట్టణ పేదలను ఆర్థికంగా పైకి తేవటానికి స్పష్టమైన కార్యాచరణ అవసరమని, ఆయా దేశాల ప్రభుత్వాలు దీనిపై తక్షణం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రపంచ బ్యాంకు పేర్కొన్నది. లేకుంటే ఈ పరిస్థితి సాంఘిక అశాంతికి దారి తీస్తుందని వివరించింది. నగరాల్లో ఒక పక్క పెద్దపెద్ద భవంతుల్లో ధనికులు నివసిస్తుంటారు, వారి పక్కనే ఇరుకు సందుల్లో, మురికివాడల్లో పేదలు ఉంటారు, ఇది ఇబ్బందికరమైన పరిస్థితి- అని ప్రపంచ బ్యాంకు ప్రతినిధి జూడీ బేకర్ తెలిపారు. ఇటువంటి పరిస్థితి తీవ్రమైన సమస్యలకు తావిచ్చినట్లు గతంలో ఎన్నో దేశాల్లో రుజువైందని పేర్కొన్నారు. పట్టణ పేదలకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించటం, పట్టణ మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి సారించటం, గృహవసతి కల్పించడం అవసరమని వివరించారు. దీని కోసం స్థానిక ప్రభుత్వాలు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాల్సి ఉన్నట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications