1965యుద్ధం పాక్ వల్లే: భారత్కు అమెరికా మద్దతు
వాషింగ్టన్: భారత్- పాకిస్థాన్ మధ్య 1965లో జరిగిన యుద్ధానికి పాకిస్థానే కారణమని స్పష్టమైంది. కాశ్మీర్పై దురాక్రమణకు పాల్పడటమే కాకుండా భారతే తమపై దాడి చేసిందని ప్రపంచాన్ని నమ్మించేందుకు పాకిస్థాన్ వేసిన ఎత్తులు బహిర్గతమయ్యాయి. ఈ మేరకు అమెరికా.. భారత్కు మద్దతుగా నిలిచింది.
1965 యుద్ధం తీవ్రస్థాయికి చేరిన సమయంలో పాకిస్థాన్-అమెరికా, భారత్- అమెరికా మధ్య జరిగిన పలు దౌత్య పరిణామాలకు సంబంధించిన పత్రాలను అమెరికా విదేశాంగశాఖ తాజాగా బయటపెట్టింది.
యుద్ధంలో పాక్ ఓటమి దశకు చేరిన సమయంలో నాటి పాకిస్థాన్ అధ్యక్షుడు ఆయూబ్ఖాన్, విదేశాంగమంత్రి జుల్ఫీకర్ అలీ భుట్టోలను పాక్లో అమెరికా రాయబారి వాల్టర్ ప్యాట్రిక్ మెక్కోటే కలిసి యుద్ధ విరమణ కోసం చర్చలు జరిపారు.
అప్పటికే భారత సేనలు పాక్ భూభాగంలోకి ప్రవేశించటంతో పాక్ పాలకులు తాము యుద్ధ బాధితులమని అమెరికాకు, ఐక్యరాజ్యసమితి కూడా ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించారు. అయితే, పాక్ వాదనను అమెరికా కొట్టిపారేసినట్లు దౌత్యపత్రాల ద్వారా వెల్లడైంది.
కాశ్మీర్లోకి దొంగచాటుగా సేనల్ని పంపి యుద్ధానికి కారణం కావటమే కాకుండా నెపాన్ని ఇతరులపై మోపుతున్నారంటూ అమెరికా రాయబారి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అదీకాక తాము ఇచ్చిన ఆయుధాలతో భారత్పై యుద్ధం చేస్తున్నారని మండిపడ్డారు.
దీంతో ప్లేటు ఫిరాయించిన పాక్ 1948లో ఐరాస చేసిన తీర్మానాన్ని అనుసరించి జమ్మూకాశ్మీర్లో ప్రజాభిప్రాయసేకరణ జరుపాలని అమెరికా, ఐరాసను కోరింది. కాగా, అమెరికా అధికారులు పాకిస్థాన్ను బేషరతుగా కాల్పుల విరమణ చేయించేందుకు తీవ్ర ప్రయత్నమే చేసినట్లు తెలుస్తోంది.