నాడు జార్జ్ ఫ్లాయిడ్..నేడు డాంటే రైట్: మరో నల్లజాతీయుడి కాల్చివేత: భగ్గుమన్న మిన్నెసొటా
వాషింగ్టన్: అమెరికాలో ప్రభుత్వం మారింది గానీ.. పరిస్థితులేవీ మారలేదనడానికి తాజా ఉదాహరణ ఈ ఘటన. అమెరికా అధ్యక్ష ఎన్నికల ముంంగిట్లో.. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున నల్ల జాతీయులు నిరసన ప్రదర్శనలు చేయడానికి, ఆందోళనలను చేపట్టడానికి కారణం- జార్జ్ ఫ్లాయిడ్ దారుణ హత్యోదంతం. జార్జ్ ఫ్లాయిడ్ హత్యపై నల్ల జాతీయులు భగ్గుమన్నారు. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంపై ఓ రకంగా తిరుగుబాటును లేవదీశారు. ఎన్నికల్లో ఆయన సారథ్యంలోని రిపబ్లికన్ల ప్రభుత్వం ఓడిపోవడానికి ప్రధాన కారకులయ్యారు.
ఇప్పుడు కూడా అవే పరిస్థితులు మళ్లీ తలెత్తాయి. మిన్నెసొటాలో మరోసారి నల్ల జాతీయుడిపై తూటా పేలింది. మిన్నెపొలీస్ పోలీసులు నల్ల జాతీయుడిని కాల్చి చంపారు. అతని పేరు డాంటే రైట్. 20 ఏళ్ల ఆఫ్రికన్-అమెరికన్. కారు డ్రైవర్. జార్జ్ ఫ్లాయిడ్ ఎక్కడైతే మరణించడాడో.. ఆ ప్రాంతానికి సరిగ్గా 16 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన ఘటనలో డాంటే రైట్ను మిన్నపొలీస్ పోలీసులు అరెస్ట్ చేయడానికి ప్రయత్నించగా.. అతను ప్రతిఘటించాడు. ఈ ప్రయత్నంలో అతను పోలీసుల వాహనాలనే ఢీ కొట్టాడు. తమపై దూసుకొస్తున్నాడని భావించిన పోలీసులు అతనిపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో అతను మరణంచాడు.
ఈ ఘటన సంచలనంగా మారింది. సమాచారం అందిన వెంటనే వందలాది మంది నల్లజాతీయులు బ్రూక్లిన్ సెంటర్ పోలీస్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. 500 మందికి పైగా నల్ల జాతీయులు ఈ నిరసనల్లో పాల్గొన్నారు. బ్రూక్లిన్ కార్యాలయం వద్ద బైఠాయించారు. ఆదివారం అర్ధరాత్రి వరకూ ఈ నిరసన ప్రదర్శనలు కొనసాగాయి. బ్రూక్లిన్ సెంటర్ కార్యాలయంలోని దూసుకుని రావడానికి కొందరు ఆందోళనకారులు ప్రయత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీనితో వారిద్దరి మధ్య ఘర్షణ పూరక వాతావరణం చెలరేగింది. ఆందోళనకారులు రాళ్లతో పోలీసుల వాహనాలపై దాడి చేశారు. పార్క్ చేసి ఉంచిన వాహనాల అద్దాలను పగులగొట్టారు.
I am closely monitoring the situation in Brooklyn Center. Gwen and I are praying for Daunte Wright’s family as our state mourns another life of a Black man taken by law enforcement.
— Governor Tim Walz (@GovTimWalz) April 12, 2021
ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్ను ప్రయోగించారు. పలువురిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వారి మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ఘటనలపై గవర్నర్ టిమ్ వాల్జ్ స్పందించారు. డాంటే రైట్ మృతి తనను కలచి వేసిందని, పేర్కొన్నారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు చెప్పారు. అవసరమైతే అదనపు పోలీసు బలగాలను మోహరింపజేస్తామని అన్నారు. స్థానిక పోలీసులు పరిస్థితులను అదుపులోకి తీసుకొస్తున్నారని చెప్పారు. డాంటే రైట్ ఘటన మిరిన్ని నగరాలకు విస్తరించే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.