‘హక్కానీ’ని ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించిన అమెరికా
వాషింగ్టన్: పాకిస్థాన్ కేంద్రంగా హక్కానీ నెట్ వర్క్ను నిర్వహిస్తున్న ఆ దేశ నేత అబ్దుల్ అజీజ్ హక్కానీని 'ప్రపంచ ఉగ్రవాది'గా అమెరికా ప్రకటించింది. ఈ మేరకు 'స్పెషల్లీ డిజిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్' జాబితాలో అజీజ్ పేరును చేర్చింది.
ఆఫ్ఘనిస్థాన్పై అజీజ్ దాడులకు ప్రణాళికలు రూపొందించాడని వెల్లడించింది. కాగా, ఈ జాబితాలోకి పేరెక్కితే, ఏ అమెరికన్ జాతీయుడు కూడా అతనితో సంబంధాలు నెరపకూడదు. అతనికేమైనా ఆస్తులుంటే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది.
అల్ఖైదాతో సంబంధాలు పెట్టుకున్న హక్కానీ నెట్ వర్క్కు అధినేతగా ఉన్న బద్రుద్దీన్ హక్కానీ మరణానంతరం అజీజ్ బాధ్యతలు స్వీకరించాడు. హక్కానీ నెట్వర్క్ నేత సిరాజుద్దీన్ హక్కానీకి అజీజ్ సోదరుడు.
అజీజ్ ఎక్కడున్నాడన్న సమాచారం అందిస్తే 5 మిలియన్ డాలర్లు ఇస్తామని అమెరికా గత సంవత్సరం ఆగస్టులో ప్రకటించింది.
ఎన్నో ఏళ్లుగా ఆప్గన్ ప్రభుత్వ కార్యాలయాలపై ఐఈడీ(ఇంప్రొవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైస్)లతో అజీజ్ దాడులు చేయించాడని అమెరికా ఆరోపించింది. హక్కానీ నెట్వర్క్ 2008లో బాంబు దాడులకు పాల్పడి 58మంది ప్రాణాలు తీసిందని పేర్కొంది. గత జూన్లో ఈ నెట్వర్క్ ఆఫ్ఘనిస్థాన్లో జరిపిన దాడుల్లో నలుగురు భారతీయులతోపాటు 14మంది స్థానికులు మరణించారు.